ETV Bharat / state

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తుది ఓటరులోనూ అవే తప్పులు - అదే నిర్లక్ష్యం!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 10:17 AM IST

Fake Votes in Tirupati: ఓటరు జాబితాలో పేరున్నా ఆయా చిరునామాల్లో ఓటర్లు ఉండరు. ఏళ్ల క్రితమే ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినా వారి ఓట్లూ పాతస్థానాల్లోనే యథాతథంగా కొనసాగుతున్నాయి. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ముసాయిదా జాబితాను తలపిస్తూ తుది జాబితాల్లోనూ ఓట్ల అక్రమాలు కొనసాగుతున్నాయి. ముసాయిదా జాబితాల్లోని తప్పులను సరిదిద్దాలని విపక్షాలు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా తుది జాబితాల్లోనూ అవే తప్పులు పునరావృతమయ్యాయి.

Fake_Votes_in_Tirupati
Fake_Votes_in_Tirupati

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తుది ఓటరులోనూ అవే తప్పులు - అదే నిర్లక్ష్యం!

Fake Votes in Tirupati : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓట్ల అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్నాయి. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా అత్యంత సంక్లిష్టంగా మారిపోయింది. ఇప్పటికే బోగస్‌ ఎపిక్ గుర్తింపు కార్డుల వ్యవహారంలో తిరుపతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వెలుగు చూస్తుండగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాల్లో వెలుగుచూస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌ బూతు స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేసి 12 వేల 74 మంది గైర్హాజరి ఓటర్లుగా గుర్తించారు. వీరిలో 7 వేల 960 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు లెక్క తేల్చారు. ఇలాంటి వాటిని జాబితా నుంచి తొలగించాల్సి ఉన్నా తుది జాబితాలో కొనసాగించారు.

సజ్జల కుటుంబానికి డబుల్ ఓట్లు - ఓటర్ల జాబితాలో పారదర్శకతకు తూట్లు

Fake Votes in Final Voter List : చంద్రగిరి నియోజకవర్గం తనపల్లెలోని 314వ పోలింగ్ కేంద్రంలో 597 ఓటర్లు ఉండగా 54 మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు ఉన్నారు. పద్మావతిపురం ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఇంటి నంబర్ల స్థానంలో పద్మావతిపురం అని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో శాశ్వతంగా వెళ్లిపోయిన వ్యక్తుల పేర్లు కొనసాగుతుండగా మరికొన్ని చోట్ల మృతులు, డబ్లింగ్ ఓటరు పేర్లను తొలగించలేదు. 301 పోలింగ్ కేంద్రంలో 36 ఓటర్ల వద్ద ఇంటి నెంబరును ఏకంగా వేదాంతపురం పేరుతో జాబితాలో చేర్చారు. 13 వందల 61 ఓట్లు ఉన్న 301 పోలింగ్‌ కేంద్రంలో దాదాపు 40 ఓటర్ల ఇంటి నెంబర్ల వద్ద వీధి పేర్లను జాబితాలో పొందుపర్చారు.

రెండు ఓట్లతో అడ్డంగా దొరికిన సజ్జల - దొంగఓట్ల దందాకు తాడేపల్లిలోనే కథ, స్క్రీన్​ప్లే: ధూళిపాళ్ల

Irregularities in Voter List : చంద్రగిరి పరిస్థితి ఇలా ఉంటే తిరుపతి నగరంలో ఓటరు జాబితా అవకతవకలతో నిండిపోయింది. ముసాయిదా జాబితాలోని బోగస్ ఓటర్ల జోలికెళ్లకుండానే తుదిజాబితా ప్రకటించారు. నెలల తరబడి నిత్యం సమావేశాలు, సలహాలు, సూచనలు, క్షేత్రపర్యటనలు చేసిన అధికారులు, బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది చివరకు ఏం సాధించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక్కో చిరునామాలో 30 నుంచి 40 మంది ఓటర్లు, బస్టాండ్ చిరునామాగా భిక్షగాళ్లకు ఓటుహక్కు, అధికారపార్టీ నేతల ఇళ్లలో పదుల సంఖ్యలో ఓట్లపై అధికారులు నోరుమెదపడం లేదు. నగరంలోని 34వ డివిజన్ కార్పొరేటర్ ఎం. మునిరామిరెడ్డి ఏకంగా మూడుచోట్ల ఓటుహక్కు పొందారు. 118 పోలింగ్ కేంద్రంలో ఒక ఓటు ఉండగా 115 పోలింగ్‌ కేంద్రంలో రెండు వేర్వేరు ఇంటి నెంబర్లతో రెండు ఉన్నాయి.

ఓటర్ల జాబితాలో ఇంటి నంబర్లు పొందుపర్చకుండా వందల సంఖ్యలో బోగస్‌ ఓట్లను జాబితాలో కొనసాగించడం ద్వారా దొంగ ఓట్లు వేసుకోవాలన్న వైఎస్సార్సీపీ నేతల ప్రణాళికకు అధికారులు వంత పాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బోగస్ ఓట్లపై అధికారుల నిర్లక్ష్యం: తుది ఓటరు జాబితాలో అవే తప్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.