ETV Bharat / state

ఒక్కడుగా వెళ్లాడు గుంపును తీసుకొస్తున్నాడు - మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఏనుగులు! - ELEPHANT GROUP COMING TO TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 11:35 AM IST

Elephant Group From Maharashtra to Telangana : బీ అలర్ట్​, మహారాష్ట్ర నుంచి ఏనుగుల గుంపు తెలంగాణ వైపు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా అటవీశాఖనే ధ్రువీకరించింది. అప్పుడు తెలంగాణ నుంచి పంపించేసిన మగ ఏనుగే వాటిని తీసుకువచ్చే ఛాన్స్​ ఉందని అధికారులు భావిస్తున్నారు.

Elephants Group from Maharashtra Coming Into Telangana
Elephants Group from Maharashtra Coming Into Telangana

Elephant Group From Maharashtra to Telangana : ఈ నెలలో ఒక ఏనుగు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించి కేవలం 14 గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులను చంపేసింది. అయితే ఆ తర్వాత ఏనుగును అటవీ శాఖ అధికారులు మహారాష్ట్రలోని దాని స్థావరానికి తిరిగి పంపించేశారు. అయితే ఇప్పుడు ఆ మగ ఏనుగు(Elephant Attack in Telangana) వల్ల పెద్ద తలనొప్పే వచ్చి పడింది. ఇప్పుడు అక్కడి నుంచి ఏకంగా ఒక ఏనుగు గుంపునే తీసుకుని రావడానికి 100 శాతం అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఆ ఏనుగుల గుంపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ అటవీ డివిజన్​లో అడుగుపెట్టే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆ గుంపే రాష్ట్రంలోకి వస్తే అవి సృష్టించే విధ్వంసం అంతాఇంతా కాదు. దాని తీవ్రత చాలానే ఉంటుందనే నేపథ్యంలో వాటిని నియంత్రించడం ఎలా అనే అంశంపై వారు దృష్టి పెట్టారు. అలాగే వాటి బారి నుంచి ఆ పరిసర ప్రాంతాల ప్రజలను ఏ విధంగా సన్నద్ధం చేయాలి, ఎలా తప్పించుకోవాలనే దానిపై అవగాహన కల్పించనున్నారు.

ఇందుకు అరణ్యభవన్​లో కొద్దిరోజుల క్రితం అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించారు. ముఖ్యంగా ఏనుగులను నియంత్రించాలంటే వాటి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టడం చాలా కీలకం. అవి ఉదయం పూట ఎక్కువగా సంచరించవు. కానీ రాత్రి పూట మాత్రం ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు రాత్రి పూట పని చేసే థర్మల్​ కెమెరా డ్రోన్ల(Thermal Camera drones)ను కొనుగోలు చేయనున్నట్లు అటవీశాఖలో కీలక అధికారి ఒకరు తెలిపారు.

మహారాష్ట్రకు వెళ్లిపోయిన ఏనుగు - ఊపిరిపీల్చుకున్న కుమురం భీం జిల్లా ప్రజలు

ఏనుగులకు అనువైన పరిస్థితులు : మహారాష్ట్ర మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు రాష్ట్రంలో సంచరించిన ప్రాంతంలో వాటికి అనువైన ప్రాంతం ఉంది. అక్కడ పచ్చని పొలాలు, సమృద్ధిగా నీరుంది. ఈ లక్షణాలు ఏనుగులు స్థిరపడేందుకు అనువైన ప్రాంతం. అయితే ఏప్రిల్​ తొలి వారంలో తెలంగాణ అడవుల్లో అడుగుపెట్టిన ఏనుగు, ఆసిఫాబాద్​ జిల్లాలోని చింతలమానెపల్లి, పెంచికల్​పేట మండలాల్లో భయాందోళన సృష్టించింది. ఆ మగ ఏనుగు 14 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల్ని బలి తీసుకుంది. ఇలా రాష్ట్రంలో ఏనుగు సంచరించడం ఇదే తొలిసారి.

Elephant Attack in Asifabad : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 60-70 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఆ ప్రాంతంతో పోలిస్తే ఆసిఫాబాద్​లో మగ ఏనుగు సంచరించిన ప్రాంతం వాటికి చాలా అనుకూలం. ఈ కారణంతోనే ఆ మగ ఏనుగు ఆ గుంపును తనతో పాటు తీసుకువచ్చే అవకాశాలు 100 శాతం ఉన్నాయని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏనుగుల గుంపు వస్తే అవి కలిగించే నష్టంపై ఆయా ప్రాంతాల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 22న దూలపల్లిలోని అటవీ అకాడమీలో వర్క్​షాప్​ నిర్వహిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఒడిశాలో పెద్దసంఖ్యలో ఉన్న ఏనుగుల గుంపుల్లో కొన్ని అక్కడ ఆవాసాలు సరిపోక పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నాయి. కొన్ని పక్కనే ఉన్న ఛత్తీస్​గఢ్​కు వెళ్లగా అక్కడి నుంచి 60-70 ఏనుగులు మహారాష్ట్రకు తరలివెళ్లి అక్కడే సంచరిస్తున్నాయి. ఆ ప్రాంతం తెలంగాణలోని ఆసిఫాబాద్​కు అనుకునే ఉంటుంది. ఆ మందలోని ఒక ఏనుగే ఇటీవల తెలంగాణకు వచ్చి విధ్వంసం సృష్టించి వెళ్లింది.

పర్యటకులను హడలెత్తించిన ఏనుగు- ఫొటోలు తీసేసరికి ఆగ్రహంతో దాడి

Couple killed in elephant attack : ఒంటరి ఏనుగు బీభత్సం.. దంపతులు మృతి, మరో యువకుడి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.