ETV Bharat / state

వైసీపీ కోడ్‌ అమలు చేస్తున్న ఖాకీలు - జగన్‌ భక్త అధికారుల అత్యుత్సాహం - Election Code Violations in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 7:10 AM IST

Election Code Violations in AP: పేరుకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. కానీ చాలా చోట్ల వైసీపీ కోడే అమలవుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 20 రోజులవుతున్నా, కొందరు వైసీపీ భక్త ఖాకీలు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. వైసీపీ రౌడీమూకల అరాచకాలకు కొమ్ముకాస్తున్నారు. కాల్చిపడేస్తా లాకప్‌లో వేస్తా’, అని విపక్షాల్ని పోలీసులు హెచ్చరిస్తున్నా ఈసీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవట్లేదు. ఇంతకీ రాష్ట్రంలో అమలవుతోంది వైసీపీ కోడా? ఎన్నికల కోడా?

Election_Code_Violations_in_AP
Election_Code_Violations_in_AP

వైసీపీ కోడ్‌ అమలు చేస్తున్న ఖాకీలు - జగన్‌ భక్త అధికారుల అత్యుత్సాహం

Election Code Violations in AP: కొద్ది రోజుల క్రితం ఖాకీ చొక్క వేసుకుని కారంపూడి సీఐ చిన్న మల్లయ్య టీడీపీ శ్రేణులపై రంకెలేశారు! కాల్చిపడేస్తా, రౌడీషీట్‌ తెరిచి లాకప్‌లో వేస్తా అంటూ తెలుగుదేశం శ్రేణుల్ని చిన్నమల్లయ్య బెదిరిస్తే ఇంతవరకూ ఎలాంటి చర్యల్లేవ్! కనీసం సంజాయిషీ అడగలేదంటే ఏపీలో అమల్లో ఉంది ఎన్నికల కోడా? వైసీపీ కోడా?

ఫిర్యాదు చేసినా చర్యలు లేవు: కర్నూలులో తెలుగుదేశం నాయకుడు శేషగిరిశెట్టిని స్పెషల్‌ పార్టీ సీఐ ఆదినారాయణరెడ్డి, ఇద్దరు కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్‌ పేరిట పిలిచి చితకబాదారు. హింసను అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతుంటే ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది? ఇలాగైతే నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యమేనా? పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఇలా తగలబెట్టారు. చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులే నిప్పుపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు లేవు

'స్టేషన్‌కు వస్తావా ? రావా ? కాల్చి పడేస్తా' - టీడీపీ నేతకు కారంపూడి సీఐ బెదిరింపు - Karempudi CI Warning to TDP Leader

అక్రమంగా గంజాయి కేసు పెట్టేందుకు యత్నం: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నాయకుల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నాయకురాలు మాధవీరెడ్డి, ఆమె కుమార్తెపై అధికారపార్టీ నాయకులు దాడికి పాల్పడితే పోలీసులు వారికే వత్తాసు పలికారు. ఇక గుడివాడలో వైసీపీ అండదండలతో పేట్రేగిపోతున్న గంజాయి బ్యాచ్‌ ఓ ఇంటర్మీడియట్‌ అమ్మాయిని వేధించింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకుండా నిందితులకే సహకరించారు. వేధింపులు మరింత పెరగటంతో బాధితురాలి తండ్రి దిశ యాప్‌లో కంప్లైంట్ చేశారు. ఫలితంగా అతనిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టేందుకు ఇన్‌స్పెక్టర్లు యత్నించారు.

కర్రలు, గొడ్డలితో దాడి: మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడేనికి చెందిన టీడీపీ నాయకులు తులసీనాయక్, రవినాయక్, శీను నాయక్‌లపై వైసీపీ శ్రేణులు కర్రలు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. పల్నాడులో వైసీపీ అరాచకాలకు అంతేలేదు. పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీని బదిలీ చేసిన ప్రభుత్వం, మరికొందరు వైసీపీ బంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రివర్స్‌లో టీడీపీ వారిపైనే కేసు: ఇక గుంటూరు జిల్లా పోలీసులూ ఎన్నికల కోడ్ అమల్లో ఒకవైపే చూస్తున్నారు. కొల్లూరు మండలం కిష్కిందపాలెంలోపంచాయతీ సిబ్బంది టీడీపీ కార్యకర్తల ఇళ్లపై జెండాలు తొలగించారు. వైసీపీ నాయకుల ఇళ్లపై ఆ పార్టీ జెండాల్ని మాత్రం తీయలేదు. ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై వైసీపీ వారు దాడి చేశారు. పోలీసులు కూడా రివర్స్‌లో టీడీపీ వారిపైనే కేసు పెట్టారు.

వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయం అందుకే రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు: చంద్రబాబు - Chandrababu Fire on YSRCP

ప్రశ్నించినందుకు దాడికి తెగబడ్డారు: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ అనుచరులు టీడీపీ కార్యకర్తలు కిషోర్, నరసింహరావులపై రాడ్లు, కుర్చీలతో దాడి చేశారు. మూడు రాజధానులపై ప్రశ్నించినందుకు దాడికి తెగబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నా సరే ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పోలీసులు వైసీపీ నాయకుల ఫిర్యాదు ఆధారంగా తిరిగి బాధితులపైనే రివర్స్‌ కేసు పెట్టారు. దాడికి పాల్పడ్డవారిపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారికి కొమ్ముకాశారు.

అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో టీడీపీ మద్దతుదారు దుకాణంలో పనిచేస్తున్న కూలీపై ఎస్సై నాగశివరెడ్డి దాడికి పాల్పడ్డారు. దుకాణ యజమాని వైసీపీలో చేరేలా ఒత్తిడి చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదులున్నాయి. అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం నుంచి వైసీపీకి 3 వేలకు పైగా మెజారిటీ తెప్పిస్తానని ఓ పోలీసు అధికారి బహిరంగంగానే శపథం చేశారు.

పార్టీకి జైకొట్టడం కూడా నేరమేనా: ‘‘జై తెలుగుదేశం, జై గొట్టిపాటి’’ అని నినాదాలు చేసినందుకు వైసీపీ నాయకుల ఫిర్యాదుపై అద్దంకి నియోజకవర్గం వేమవరం తండావాసులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కొందరు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయించారు. తమకు నచ్చిన పార్టీకి జైకొట్టడం కూడా నేరమేనా?

కాకినాడలో దారుణం - అభిషేకం సరిగా చేయలేదని అర్చకుడిని కాలితో తన్నిన వైసీపీ నేత - YSRCP Leader Attack on Priest

ఇక కాకినాడ శివాలయంలో అర్చకుడిని వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావు కాలితో తన్ని, చెంపపై కొట్టారు. పోలీసులు రాజీ కుదిర్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మొక్కుబడి సెక్షన్‌తో సరిపెట్టేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడూ పోలీసులు వైసీపీ నాయకులు ఎంతలా కొమ్ముకాస్తున్నారో చెప్పేందుకు ఇదే నిరద్శనం.

శాంతియుత ఎన్నికలు సాధ్యమేనా: రాజకీయ హింసకు తావివ్వొద్దని, అవాంఛనీయ ఘటనలు జరిగేతే ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించినా వైసీపీ అధికార అహంతో కల్లు మూసుకున్న కొందరు కొందరు పోలీసులు అవేవీ లెక్క చేయడంలేదు. ఇదే అదునుగా వైసీపీ నాయకులు పేట్రేగుతున్నారు. ఇలాంటివారిని ఉపేక్షిస్తే ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ హింసాత్మక ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. శాంతియుత ఎన్నికలు నిర్వహించాలనే ఈసీ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది.

పల్నాడు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు - వైసీపీ పనేనన్న నేతలు - Fires Breaks Out At Party Office

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.