CM Jagan Mohan Reddy Cheated Kalyana Mitra : 'నేను ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం కల్యాణమిత్రలుగా మీరే ఉంటారు. పెళ్లిళ్లు నిర్వహిస్తారు. పగలు జరిగే పెళ్లికి ఇచ్చే 250 రూపాయల ప్రోత్సాహకాన్ని 500 రూపాయలకు, రాత్రి జరిగే పెళ్లికిచ్చే మొత్తాన్ని 500 రూపాయల నుంచి 1000రూపాయలకు, క్షేత్రస్థాయి తనిఖీకి వెళితే ఇచ్చే మొత్తాన్ని 300 రూపాయల నుంచి 600 పెంచుతామని' 2019 జులై 5వ తేదీన కల్యాణమిత్రలకు సీఎంగా జగన్ ఇచ్చిన హమీ ఇది.
'బీమా మిత్రలకు గౌరవ వేతనం కింద ప్రతి నెలా 3 వేల రూపాయలు ఇస్తాం. క్లెయిమ్ అప్లోడ్ చేసిన వెంటనే వెయ్యి రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తామని' 2019 జులై2న బీమా మిత్రలకు జగన్ హామీ ఇచ్చారు. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో అదే చేస్తాడని జగన్ పదే పదే చెప్పే నిజంగానే ఇచ్చిన హామీ అమలు చేస్తారేమో అని నమ్మిన మహిళలు తీరా చూస్తే మోసపోయారు.
కల్యాణమిత్రలు, బీమామిత్రలకు ఎక్కడ లేని హామీలిచ్చిన సీఎం జగన్ తీరా అధికారంలోకి వచ్చాక వారి పొట్ట మీదనే కొట్టారు. అక్కచెల్లెమ్మలు అక్కచెల్లెమ్మలంటూ పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ తలపై చేతులు పెట్టి బుగ్గలు నిమిరి అధికారం రాగానే వారి ఉపాధికే ఎసరు పెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో కల్యాణమిత్రలు, బీమామిత్రలు భాగస్వామ్యంగా ఉన్న పెళ్లికానుక, బీమా పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. కానీ కల్యాణమిత్రలు, బీమామిత్రలు మాత్రం లేరు. వారిని తొలగించారు. వీరంతా కూడా నెలకు 10 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయలు సంపాదించిన వారే. వారికి ఉపాధే లేకుండా చేసి ఇది జగన్ మార్క్ మోసమని నిరూపించుకున్నారు.
ఆర్థిక సాయం పెంచుతున్నట్లు బిల్డప్ - లబ్దిదారుల కుదింపు - ఇవే జగన్ మార్క్ ఐడియాలు
కల్యాణమిత్రలు, బీమామిత్రలను అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా తొలగించిన జగన్ ఆ తర్వాత యానిమేటర్ల తొలగింపే లక్ష్యంగా పావులు కదిపారు. 2019 నవంబర్లో 3 ఏళ్ల కాలపరిమితి నిబంధనను తెరమీదకు తెచ్చి నిర్దేశిత గడువు దాటిన వారందరినీ తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు. అదే ఏడాది డిసెంబర్ నుంచే దీన్ని అమలు చేసేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేల ఇంటిని దిగ్బంధనం చేశారు. అయినప్పటికీ కాలపరిమితిని సర్క్యులర్ను రద్దు చేయకుండా మరో మూడేళ్లు పొడిగింపు ఇచ్చారు. ఆ గడువూ 2022 డిసెంబర్తో ముగియడంతో అప్పుడు కూడా మళ్లీ ఆ నిబంధనను అమలు చేసేందుకు చూశారు. యానిమేటర్లు ఈసారీ కూడా ఆందోళనకు దిగటంతో రెన్యువల్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ నిబంధనను తొలగించాలని యానిమేటర్లు నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే వారి మెడపై 3 ఏళ్ల కాలపరిమితి నిబంధన కత్తి ఇంకా వేలాడుతున్నట్టే. రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్లు 28 వేల మంది ఉన్నారు. మహిళ సాధికారతకు కృషి చేస్తానంటూ జగన్ తమను వంచించారని కల్యాణమిత్రలు, బీమామిత్రల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మీ ధ్వజమెత్తారు.
యానిమేటర్లు అడ్డుకుంటే జగన్ ఊరుకుంటారా! మరో ఎత్తు వేశారు. 15 కంటే తక్కువ డ్వాక్రా సంఘాలుంటే వాటిని ఎక్కువ సంఘాలు ఉండే యానిమేటర్ల పరిధిలో విలీనం చేయాలనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. అంటే తక్కువ సంఘాలుండే యానిమేటర్ల ఉపాధి దెబ్బతీసినట్టే. దీన్ని కూడా వారు అడ్డుకున్నారు. దీంతో 15 కంటే తక్కువ సంఘాలను పర్యవేక్షించే యానిమేటర్లకు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన 8 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని మూడేళ్ల నుంచి ఇవ్వకుండా నిలిపేశారు. పట్టణాల్లో పనిచేసే రీసోర్స్ పర్సన్ల పరిస్థితీ మరింత దారుణం. వీరికి 3 ఏళ్ల కాలపరిమితితోపాటు 45 ఏళ్లు నిండితే తొలగింపు నిబంధన కూడా పెట్టారు. దాన్ని అమలు చేస్తూ ఎక్కడికక్కడ ఆర్పీలను తొలగించేశారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత పథకం కింద ఉపాధి కల్పిస్తున్నామని ఉత్తుత్తి కబుర్లు చెప్పే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతంగా కాళ్లపై నిలబడి కుటుంబాలను పోషించుకుంటున్న ఆర్పీలను మాత్రం తొలగించేసింది. ఆర్పీలు రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మంది ఉన్నారు.
ఇవన్నీ తట్టుకుని యానిమేటర్లు, ఆర్పీలు నిలబడ్డారు. అందుకే వారిపై 'పొమ్మనకుండా పొగబెట్టే' అస్త్రాన్ని ప్రయోగించారు. అడుగడుగునా వారిపై ఒత్తిడి పెంచే పనులే పెట్టారు. డ్వాక్రా మహిళలపై ఒత్తిడి పెట్టి చేయూత మార్ట్ల్లో సరుకులు కొనుగోలు చేయించారు. ఓటీఎస్ పేరుతో డ్వాక్రా మహిళల నుంచి అప్పు వసూలు చేసే బాధ్యత కూడా వీరికే అప్పగించారు. ఇవన్నీ వారికి నిర్దేశించిన బాధ్యతలు కావు. అయినా వారితోనే ఇవన్నీ చేయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.