ETV Bharat / state

గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 7:53 PM IST

Updated : Jan 24, 2024, 8:41 AM IST

ACB Investigation on Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ కేసును అవినీతి నిరోధకశాఖ లోతుగా విచారిస్తోంది. సీఐయూ విభాగం ఇప్పటికే కేసు నమోదు చేయగా గుత్తేదారుతో కుమ్మక్కై పశుసంవర్ధక శాఖలోని నలుగురు అధికారులు, సిబ్బంది నిధులు గోల్‌మాల్‌ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. గొర్రెల పంపిణీ కేసులో ఇంకా ఎవరెవరున్నారు? అక్రమార్కులు ఎంత మొత్తం స్వాహా చేశారనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు గొర్రెల పంపిణీ పథకం కింద నిధుల మళ్లింపుపై పశుసంవర్ధక అధికారిపై నమోదైన కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

Telangana Sheep Scam 2024
ACB Investigation on Sheep Distribution Scam

గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు

ACB Investigation on Sheep Distribution Scam : రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీలో (Sheep Distribution in Telangana) అవినీతి నిరోధక శాఖ తీగ లాగుతోంది. ఇటీవలే ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయగా ఉన్నతాధికారులు విచారణను సీఐయూకి అప్పగించారు. రంగంలోకి దిగిన విచారణ బృందం అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించి విచారణ వేగవంతం చేసింది. మొత్తం 133 గొర్రెల యూనిట్లకు చెల్లించాల్సిన రూ.2.20 కోట్లు దారి మళ్లినట్లు తేల్చారు.

ఇందుకు సంబంధించి హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దస్త్రాలు, హార్డ్‌డిస్క్‌లు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో 133 గొర్రెల యూనిట్లకు సంబంధించిన నిధులు మాత్రమే గోల్‌మాల్‌ అయ్యాయా? గతంలోనూ ఏమైనా నిధులు స్వాహా చేశారా? పశుసంవర్ధక శాఖకు చెందిన ఎంత మంది అధికారులు, సిబ్బంది ఈ వ్యవహారం నడిపించారు? ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా? అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు.

గొర్రెల సంపదలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ..

Telangana Sheep Distribution Scam : కేసు విచారణలో భాగంగా ఒకట్రెండు రోజుల్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న గుత్తేదారు, పశుసంవర్ధక శాఖ అధికారులు, (Telangana Animal Husbandry Department) సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవహారంలో మరిన్ని నిధులు గోల్‌మాల్‌ జరిగినట్టు అనిశా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో ఏసీబీ కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరణ : గొర్రెల పంపిణీ పథకం కింద నిధుల మళ్లింపుపై మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక అధికారి ఎమ్‌.ఆదిత్య కేశవసాయిపై కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. రైతులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల నిధుల మళ్లింపుపై ఈనెల 26న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ పశుసంవర్ధక శాఖ అధికారి ఆదిత్య కేశవ సాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గొర్రెల పంపిణీకి చెందిన లావాదేవీలన్నీ గత ఏడాది ఆగస్టులో జరగ్గా, ఎన్నికలు పూర్తయ్యాక డిసెంబరులో కేసు నమోదు చేశారంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మసనానికి వివరించారు.

పంపిణీ గొర్రెలు అమ్ముతుండగా..

గొర్రెలకు ట్యాగింగ్, ఫొటోలు తీయడం, ఇతర వివరాలను కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేయాలని, దాని ఆధారంగా నిధులను బదిలీ చేయాల్సి ఉందని, ఏసీబీ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గొర్రెలను సరఫరా చేసిన రైతులకు నిధులు అందలేదని, అవి ఇతరుల ఖాతాల్లోకి మళ్లింపు జరిగిందని, అధికారుల సాయం లేకుండా ఈ కుంభకోణం జరగదని న్యాయస్థానానికి వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులు నమోదు చేసిన కేసు అనిశాకు బదిలీ కావడంతోపాటు, పిటిషనర్ పాత్ర నిర్ధారణ కాలేదన్నారు. అదేవిధంగా పిటిషనర్ ముందస్తు బెయిలు పిటిషన్ వచ్చే వారం విచారణకు రానున్నందున, ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

గొర్రెల పంపిణీ నిధుల గోల్​మాల్​లో ఉన్నతాధికారుల ప్రమేయం - రంగంలోకి ఏసీబీ

గొర్రెల పంపిణీ విషయంలో.. సర్కారు ట్విస్ట్​?

Last Updated : Jan 24, 2024, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.