ETV Bharat / politics

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పేట్రేగిపోతున్న అవినీతి రాజా- ప్రజాప్రతినిధి మామ కనుసన్నల్లోనే దందాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 7:22 AM IST

Updated : Mar 4, 2024, 9:11 AM IST

YSRCP_Leaders_Irregularities_in_AP
YSRCP_Leaders_Irregularities_in_AP

YSRCP Leaders Irregularities in AP: ఇసుక, మట్టి, గుట్కా, మద్యం, భూకబ్జాలు!! ఒక్కటేమిటి ఆ అరాచక శక్తి అడుగు పెట్టని రంగమే లేదు. మూడు ముక్కలాటలు, గానాభజానాలో మునిగితేలే ఆ వ్యక్తికి అధికారం అంది వచ్చింది. రాష్ట్రస్థాయిలో కీలక పదవీ దక్కింది. ఇక ఆగుతారా!! అడ్డూ అదుపులు లేకుండా పేట్రెగిపోతున్నారు. కుటుంబ సభ్యులను, అనుచరులను జనంపై బందిపోటు దొంగల్లా వదిలేశారు. ఆ అవినీతి రాజా దోపిడీకి హద్దే లేకుండా పోయింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పేట్రేగిపోతున్న అవినీతి రాజా- ప్రజాప్రతినిధి మామ కనుసన్నల్లోనే దందాలు

YSRCP Leaders Irregularities in AP: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్లుగా ఆ అక్రమాల రారాజు చెలరేగిపోతున్నారు. భూములను కబ్జా చేస్తున్నారు. చెరువులు, కాలువ కట్టల్లోని మట్టిని తవ్వేస్తున్నారు. కొండల్ని కొల్లగొడుతున్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టించడం, అక్రమాలను వెలుగులోకి తెచ్చిన విలేకర్లను బెదిరించడం ఆయనకు వెన్నతో పెట్టి విద్య. ఓ దళిత యువకుడి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడికి అండాదండా ఆయనే. ఈ అవినీతి రాజా వ్యవహారాలన్నీ ఆయనకు పిల్లనిచ్చిన మామ కనుసన్నల్లోనే కొనసాగుతాయి. ఈయన అనుచరులు సైతం తమ దందాల సొత్తును 'మామ'కే చేరవేస్తుంటారు.

తుని నుంచి కోటనందూరు మండలం అల్లిపూడి వరకు తాండవ నదిలో ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తవ్వేస్తున్నారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు నిత్యం కొన్ని వందల లోడ్లు తరలిస్తూ కోట్లు రూపాయలు అర్జిస్తున్నారు. సముద్ర తీరంలోని బొండు ఇసుకను సైతం వదలం లేదు.

వేమవరం, ఎర్రయ్యపేట, అన్నయ్యపేట, ఎల్లయ్యపేట, దానవాయిపేట తదితర గ్రామాల్లో బొండు ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తూ సొమ్ములు వెనకేసుకుంటున్నారు. ఏలేరు, పోలవరం కాలువ గట్లపై ఉన్న మట్టి నిల్వలను అడ్డగోలుగా తవ్వేసి విక్రమిస్తున్నారు. చెరువుల్లో మట్టిని ఇటుక బట్టీ వ్యాపారులకు అమ్ముకున్నారు. చిన్నచిన్న కొండలు, గుట్టల్ని సైతం ఈ అయిదేళ్లలో కరిగించేశారు.

వైఎస్సార్సీపీ నేతల పాపాలు- పార్టీలో చేరలేదని టీడీపీ మద్దతుదారుడి కోళ్లఫారం కూల్చివేత

తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామ చెరువు గర్భంలోని వంద ఎకరాల్లో కోదాడ గ్రామ దళితులు కొన్ని దశాబ్దాలుగా పంటలు వేసుకుంటున్నారు. అందులోని 70 ఎకరాలను ఈ ప్రజాప్రతినిధి తనకు కావాల్సిన వ్యక్తికి కట్టబెట్టి తద్వారా భారీగా లబ్ధి పొందారు. ఈ భూమిలో సాగు చేసుకుని జీవిస్తున్న దళిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా వారిపై ఉక్కుపాదం మోపారు.

కోదాడలో మూడెకరాల గ్రామకంఠం భూమిని సబ్‌ డివిజన్‌ చేయించి తన అనుచరుడైన వైసీపీ నాయకుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. తర్వాత ఆ భూమిని జగనన్న కాలనీల కోసం ఎకరం రూ.40 లక్షలు చొప్పున ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. ఇలా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మేసి ఈ ఒక్క డీల్‌లోనే కోటికిపైగా కొల్లగొట్టారు.

తుని మండలం రాజుపేట వద్ద జగనన్న కాలనీ కోసం 110 ఎకరాల భూమిని సేకరించారు. అక్కడున్న వాస్తవ ధర కంటే అనేక రెట్ల అధిక మొత్తానికి ప్రభుత్వంతో కొనిపించి కమీషన్ల రూపంలో భారీగా లబ్ధి పొందారు. ఎక్కడైనా విలువైన భూమి ఉంటే చాలు దానిపై కన్నేస్తారు. తామే కొంటామంటూ యజమానికి కొంత అడ్వాన్సు చెల్లిస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండానే భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆ అరాచక ప్రజాప్రతినిధి మామ తన భూమిని ఇలాగే లాక్కున్నారని ఆరోపిస్తూ పాయకరావుపేటకు చెందిన ఓ మహిళ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కనీసం రెండుకు తగ్గకుండా మద్యం గొలుసు దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ ప్రజాప్రతినిధి అనుచరుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. గొలుసు దుకాణాల్లో క్వార్టర్‌ మద్యం సీసాపై అదనంగా రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. అందులో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి, అతని మండల స్థాయి అనుచరులు, గొలుసు దుకాణం నిర్వాహకులు 10 చొప్పున వాటాలు పంచుకుంటున్నారు.

ఇలా కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు. తెలంగాణ మద్యాన్ని తీసుకొస్తూ గొలుసు దుకాణాల్లో విక్రయిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధే ఈ దందా నడిపిస్తుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. నిషేధిత గుట్కా వ్యాపారమూ ఈ ప్రజాప్రతినిధి అండదండలతో సాగుతోంది. లాటరీ టికెట్లను విక్రయించే వారి నుంచి నెలకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కూడా నడుస్తున్నాయి.

నియోజకవర్గంలో ఎవరైనా బహుళ అంతస్తుల భవనం నిర్మించాలంటే తొలుత ఈ ప్రజాప్రతినిధికి అడిగినంత కప్పం చెల్లించాల్సిందే. లేకపోతే ఒక్క ఇటుక కూడా పెట్టనీయకుండా వేధిస్తారు. ఈ దెబ్బకు అక్కడ భవనాలు నిర్మించాలంటేనే స్థిరాస్తి వ్యాపారులు హడలుతున్నారు. వ్యాపారులు, రైతులు ఆక్వా చెరువులు తవ్వుకోవాలంటే ముందుగా ఎకరాకు రూ.లక్ష చొప్పున ముట్టజెప్పాల్సిందే.

ఒక్క తొండంగి మండలంలోనే ఇలాంటివి 200 వరకు చెరువులున్నాయి. వాటి ద్వారా కోట్లు గుంజేశారు. రవాణా శాఖ చెక్‌పోస్టును సైతం తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అక్కడ తన అనుచరుల్ని మోహరించి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. తొండంగి మండలంలో నిర్మాణంలో ఉన్న పలు పరిశ్రమల నుంచి భారీ మొత్తాల్లో వసూలు చేశారు.

ప్రతి మండలాన్ని తనకు నమ్మిన బంటులైన ఒకరిద్దరు అనుచరులకు అప్పగించేశారు. వారు దందాలకు తెగబడుతున్నారు. తొండంగికి చెందిన ఓ అనుచరుడు తన కారుకు ప్రజాప్రతినిధి స్టిక్కర్‌ను అంటించుకుని తిరుగుతుంటారు. మద్యం, గుట్కా, లాటరీ టికెట్ల వ్యాపారాలన్నీ నడిపిస్తారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రజాప్రతినిధి స్నేహితుడితోపాటు ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త, నామినేటెడ్‌ పదవిలో ఉన్న మరో నాయకుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో మండలంలో ఉప ఎంపీపీ, మరో ఇద్దరు పార్టీ వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు. ఇంకో మండలంలో జిల్లా వ్యవసాయ సలహా మండలిలోని కీలక నాయకుడు, ఒక మండల స్థాయి ప్రజాప్రతినిధి, ఒక దేవస్థానానికి గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించిన మరోవ్యక్తి దందాలు చేస్తున్నారు.

Skill Development Program vs Smart Meters Project: స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ ఐతే.. స్మార్ట్ మీటర్లతో ప్రజాధనం దుర్వినియోగం కాదా..?

Last Updated :Mar 4, 2024, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.