ETV Bharat / politics

రాజకీయాలకు గల్లా జయదేవ్‌ గుడ్‌బై - సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 1:10 PM IST

Guntur_TDP_MP_Galla_Jayadev_Comments
Guntur_TDP_MP_Galla_Jayadev_Comments

Guntur TDP MP Galla Jayadev Comments: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ప్రస్తుత నిర్ణయం తాత్కాలికమేనన్నారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని గల్లా జయదేవ్‌ వెల్లడించారు.


Guntur TDP MP Galla Jayadev Comments: ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులని మౌనంగా ఉండలేనని తెలిపారు. అందుకే రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.

రాజకీయాలకు గల్లా జయదేవ్‌ గుడ్‌బై - సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ

మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదు: రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయన్న గల్లా జయదేవ్‌, తాను మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని కానీ పార్లమెంటులో మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదని చెప్పారు. పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగలేనని, రాజకీయం, వ్యాపారం రెండుచోట్ల ఉండలేనన్నారు. అందుకే రాజకీయం వదిలేస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం తన నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారని, అప్పటి నుంచి తనకు బాధ్యత పెరిగిందని అన్నారు. తమ సంస్థల్లో 17 వేల ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలి: ఎంపీలకు ప్రత్యేక అధికారాలు లేవన్న జయదేవ్, ప్రాంతీయ పార్టీల్లో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో అవిశ్వాసం వేళ తాను మాట్లాడానని గుర్తు చేశారు. దీంతో ఈడీ అధికారులు రెండుసార్లు పిలిచి విచారించారని తెలిపారు. ప్రజలు నా సేవలు గుర్తించి రెండోసారి ఎంపీగా చేశారన్న జయదేవ్‌, అమరావతి రైతులతో చలో అసెంబ్లీ నిర్వహించానని అన్నారు. ఆ సమయంలో పోలీసులు అరెస్టు చేస్తే ప్రజల కోసం జైలుకు వెళ్లానని పేర్కొన్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ అంశం.. లోక్​సభలో లేవనెత్తిన ఎంపీ గల్లా జయదేవ్


వాటిని ఆయుధాలుగా ప్రయోగించారు: అమరావతి పేరును దేశ చిత్ర పటంలో పెట్టేలా చేశానన్న జయదేవ్‌, తమ కంపెనీలన్నీ చట్టపరంగా నడుపుతున్నామన్నారు. వ్యాపారం నడపాలంటే 70 ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతి కావాలని స్పష్టం చేశారు. ఆ విభాగాలను ఆయుధాలుగా మార్చి తమపై ప్రయోగించారన్నారు. తమ వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని, సీబీఐ, ఈడీ తన ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని ఆరోపించారు. కుటుంబం, ఉద్యోగుల సహకారంతో పోరాటం కొనసాగిస్తున్నానన్నారు. తాము న్యాయపరంగా ముందుకు వెళ్లామని తెలిపారు.

రాజకీయాలు నన్ను మార్చలేవు: కోర్టులో తామే గెలుస్తామనే నమ్మకం ఉందన్న జయదేవ్‌, అయితే పోరాటంలో గెలిచినా యుద్ధంలో ఓడిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వల్ల ఆ పరిస్థితి వచ్చిందని, నిజాయతీ గలవారు రాజకీయాల్లోకి వచ్చినా మౌనంగా ఉండటం తప్ప ఏం చేయలేని పరిస్థితి ఉందని అన్నారు. వీలైతే రాజకీయాలను మారుస్తా, కానీ రాజకీయాలు తనను మార్చలేవని పేర్కొన్నారు. తన బలాలు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత బలహీనతగా మారాయని వ్యాఖ్యానించారు. నిజాయితీ, సామర్థ్యం, స్వాతంత్ర్యం అన్నీ రాజకీయాల్లో బలహీనతగా మారాయని చెప్పారు.

ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా: 55 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తన తాత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్న జయదేవ్, తన అమ్మ కూడా ప్రజా సేవ కోసం అమెరికా నుంచి తిరిగి వచ్చిందని తెలిపారు. తన అమ్మ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారని, ప్రజలకు సేవ చేసేందుకు తాను కూడా అమెరికా నుంచి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.

ఏపీ విభజన హామీలపై ఏం చెప్పారు.. ఏం జరుగుతోంది..!: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌


కేంద్రం, రాష్ట్రంతో పోరాడుతూనే ఉన్నాం: రాజకీయాలు, వ్యాపారాన్ని ఎప్పుడూ వేరుగానే చూశానని, ప్రజలు తనపై విశ్వాసంతో రెండోసారి ఎంపీగా చేశారని అన్నారు. బాధ్యతాయుతంగా కేంద్రం, రాష్ట్రంతో పోరాడుతూనే ఉన్నామన్న రాజధాని అమరావతి కోసం రైతులతో కలిసి పోరాడానని, భారతదేశ మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా చూపలేదని పార్లమెంటులో పోరాడానని గుర్తు చేశారు.

రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేశానన్న జయదేవ్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో లేవనెత్తానని గుర్తు చేశారు. రాజధానిగా అమరావతిని చేయడానికి పోరాడుతూనే ఉన్నామని, అమరావతి ప్లానింగ్‌ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ విభాగంలోనూ పనిచేశానని, మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా జపాన్‌, సింగపూర్‌ తదితర దేశాల్లో పర్యటించామన్నారు.

టీడీపీ సరైందని భావించి పార్టీలో చేరా: చాలా మంది వివిధ రంగాల్లో ఉంటూ రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారని, వైద్యులు, రైతులు వివిధ వృత్తుల వారు రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు. అదే విధంగా తాను కూడా వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నానని చెప్పారు. ఒక ఎంపీ స్థానం పరిధిలో భారత్‌లో 25 లక్షల మంది జనాభా ఉన్నారన్న జయదేవ్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంపీ స్థానం పరిధిలో జనాభా చాలా తక్కువగా ఉందని అన్నారు. రాజకీయాలకు ముందు వ్యాపార అనుభవం ఉందని, కొంత విశ్లేషణ చేసి టీడీపీ సరైందని భావించి పార్టీలో చేరానన్నారు. గ్రూపు రాజకీయాల నుంచి తాను దూరంగా ఉన్నానని, స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకుని ముందుకు వెళ్లానని తెలిపారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి.. లోక్​సభలో టీడీపీ డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.