ETV Bharat / politics

ఆ నలుగురిని అనర్హులుగా ప్రకటించండి - స్పీకర్​కు స్పష్టం చేసిన చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 7:23 PM IST

Chandrababu Reply to Speaker on MLAs Disqualification Petition: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు తన అభిప్రాయం తెలిపారు. తెలుగుదేశం నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఇచ్చామని తెలిపిన ఆయన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Chandrababu_Reply_to_Speaker_on_MLAs_Disqualification_Petition
Chandrababu_Reply_to_Speaker_on_MLAs_Disqualification_Petition

Chandrababu Reply to Speaker on MLAs Disqualification Petition: తెలుగుదేశం నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్​కు స్పష్టం చేశారు. ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్ వేశారు. బాల వీరాంజనేయస్వామి ఇచ్చిన అనర్హత పిటిషన్​పై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ అధినేత అభిప్రాయం కోరారు. దీంతో ఈ మేరకు తన అభిప్రాయాన్ని చంద్రబాబు స్పీకర్​కు పంపారు.

కాగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​కు ముందే రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతి విషయంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక పార్టీలోని నేతలు మరో పార్టీలో చేరుతున్నారు. సీఎం జగన్ నియంతృత్వ పోకడలతో అధికార వైఎస్సార్సీపీలో అసంతృప్త నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీ, జనసేనలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు కూడా అధికార వైఎస్సార్సీపీలోకి జారుకుంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమే: చంద్రబాబు

ఇలా ఎప్పుడు ఏ పార్టీల్లో చేరతారో తెలియని పరిస్థితి నెలకొన్న సమయంలో తమ పార్టీ నేతల కదలికలపై ఆయా పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి బయటకొచ్చిన పలువురు నేతలు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో తమ పార్టీని వీడిన నేతలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇదే రూట్​లో టీడీపీ కూడా గతంలో తమ పార్టీ నుంచి గెలిచి వైఎస్సార్సీపీలో చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌, మద్దాలి గిరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసింది.

కాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2012 ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన గంటా శ్రీనివాస‌రావు స్పీక‌ర్​కు తన రాజీనామా లేఖ‌ను పంపించగా ఇన్నేళ్లకు హఠాత్తుగా మంగళవారం ఆమోదం తెలిపారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉన్న సమయంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

విశాఖప‌ట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్న గంటా రెండు మూడు సార్లు స్పీకర్​ను కలిసి తన రాజీనామా ఆమోదించాల‌ని గతంలో కోరారు. అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోని స్పీకర్ ఇప్పుడు తన రాజీనామాకు ఆమోదం తెలిపారు. దీంతో రాజ‌కీయ కోణంలోనే సుమారు మూడేళ్ల తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

రాజకీయ విలువల్లో జగనన్న స్టైలే వేరు - పార్టీని వ్యతిరేకిస్తే అనర్హత వేటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.