ETV Bharat / bharat

కశ్మీర్​ టు పంజాబ్​- డ్రైవర్ లేకుండా 78కి.మీ దూసుకెళ్లిన రైలు- టెన్షన్ టెన్షన్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 1:48 PM IST

Train Run Without Driver : లోకోపైలట్ లేకుండా జమ్ముకశ్మీర్​ నుంచి పంజాబ్​ వరకు గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దాదాపు గంటకు 80 కిలో మీటర్ల వేగంతో 78 కిలోమీటర్లు తానంతటదే రైలు పరుగులు తీసింది. ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్​ దర్యాప్తునకు ఆదేశించారు.

Train Run Without Driver
Train Run Without Driver

కశ్మీర్​ టు పంజాబ్​- డ్రైవర్ లేకుండా 78కి.మీ దూసుకెళ్లిన రైలు- టెన్షన్ టెన్షన్!

Train Run Without Driver : లోకో పైలట్‌ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి కలకలం రేపింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో నిలిపిన ఓ సరకు రవాణా రైలు పంజాబ్​ వైపునకు వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు పలు స్టేషన్లలో రైలును అపేందుకు విఫలయత్నం చేశారు. చివరకు పంజాబ్​ హోషియాపుర్ జిల్లా ముకేరియన్​లోని ఉచ్చి బస్సీ సమీపంలో రైలును నిలిపివేశారు. ఈ ఘటన రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్​ దృష్టికి వెళ్లగా, ఆయన విచారణకు ఆదేశించారు.

కారణం అదే!
53 వ్యాగన్ల చిప్​స్టోన్స్​ లోడ్​తో జమ్ముకశ్మీర్​ నుంచి పంజాబ్​ బయలుదేరిన గూడ్స్​ రైలు (14806R) జమ్ములోని కథువా రైల్వేస్టేషన్​లో ఆగింది. అయితే లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ హ్యాండ్​బ్రేక్​ వేయకుండానే బయటకు వెళ్లిపోయారు. దీంతో పఠాన్​కోట్​ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. క్రమంగా గంటకు 80 కిలో మీటర్ల వేగం అందుకుంది. ఈ ఘటన ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు.

ట్రైన్​ను ఆపేందుకు విఫలయత్నం
లోకోపైలట్ లేకుండా ట్రైన్ దూసుకెళ్లడంపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును పఠాన్​కోట్, కండ్రోలి, మిర్తాల్, బంగ్లా, ముకేరియా స్టేషన్లలో ఆపేందుకు విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పట్టాలపై స్టాపర్స్​ను అమర్చినా ఫలితం లేకపోయింది. అయితే ముకేరియా స్టేషన్​ దాటాక రైలు వేగం నెమ్మదించింది. ఈ క్రమంలో రైల్వే అధికారులు ఉచ్చి బస్సీ స్టేషన్ వద్ద రైలు నిలిపివేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రూట్​లోని అన్ని రైల్​-రోడ్​ క్రాసింగ్​లను మూసివేశామని జీఆర్​పీ ఎస్​ఐ (జలంధర్) అసోక్​ కుమార్​ తెలిపారు.

ఈ ఘటనపై రైల్వే అధికారులు తీవ్రంగా స్పందించారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని జమ్మూ రైల్వే డివిజన్ ట్రాఫిక్ మేనేజర్ తెలిపారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి, భద్రతా లోపాలను గుర్తించడానికి విచారణ ప్రారంభించామని వెల్లడించారు. ఈ విషయం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ దృష్టికి వెళ్లగా ఆయన విచారణకు ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.