ETV Bharat / bharat

ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెరపైకి కచ్చతీవు- అధికార విపక్షాల మాటల యుద్ధం- ప్లస్​ అయ్యేది​ వారికే! - Katchatheevu Island 2024 Loksabha

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 9:18 AM IST

Katchatheevu Issue 2024 Loksabha Elections : సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాట రాజకీయంగా సున్నితమైన కచ్చతీవుపై దుమారం కొనసాగుతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమిళ పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ ఓట్లు అడుగుతుండగా, ఈసారి బీజేపీ ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. ఇందిరాగాంధీ హయాంలో ఈ దీవిని కేంద్ర ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించగా కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపర్చేలా కాంగ్రెస్‌ పని చేసిందంటూ ప్రధాని మోదీ దుమ్మెత్తి పోయగా, హస్తం నేతలు ఎదురుదాడికి దిగారు.

Katchatheevu Issue 2024 Loksabha Elections
Katchatheevu Issue 2024 Loksabha Elections

Katchatheevu Issue 2024 Loksabha Elections : సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడల్లా తమిళనాడులో రాజకీయ పార్టీలకు గుర్తొచ్చే అంశం కచ్చతీవు. బీజేపీ తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్న సమయంలో కచ్చతీవు దీవి అంశాన్ని కూడా ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. భారత్‌కు చెందిన కచ్చతీవు దీవిని 1974లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించగా ఈ అంశాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినట్లు చెప్పిన అన్నామలై తాజా రాజకీయ దుమారాన్ని రేపారు.

భారత మత్స్యకారులకు ప్రవేశం ఉంది!
తమిళనాడు రామేశ్వరం సమీపంలోని భారత్‌-శ్రీలంక మధ్య ఉన్న చిరు ద్వీపమే కచ్చతీవు. ఇది రామేశ్వరానికి 19 కిలోమీటర్లు శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకే మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు. దీనిని తమిళ నేతలు ఏమాత్రం ఆమోదించలేదు. శాసనసభలో తీర్మానం, సుప్రీంకోర్టులో కేసులు వేశారు.

వాస్తవానికి ఇది చాలా చిన్నదీవి. ఎవరూ ఉండరు. అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉండడం వల్ల భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక, ఈ దీవి తమది అనే నెపంతో భారత మత్స్యకారులపై దాడులు చేయడం సహా అరెస్టులు చేస్తోంది. ఈ దీవిలో భారత్‌ మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నప్పటికీ శ్రీలంక ఖాతరు చేయడం లేదు. కచ్చతీవు దీవిలో సెయింట్‌ ఆంటోనీ అనే ప్రార్థనామందిరం ఉంది. ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు.

అలా ఇచ్చేయడం చెల్లదు!
న్యాయపరంగా చూస్తే కచ్చతీవు దీవిని శ్రీలంకు అప్పగించడం చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. భారత రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. 1958లో భారత్‌-తూర్పు పాకిస్థాన్‌ మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది. దానిపై అప్పటి ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్థాన్‌ గవర్నర్‌ ఫిరోజ్‌ఖాన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్థాన్‌కు ఇచ్చారు. దీనిపై వివాదం చెలరేగడం వల్ల సుప్రీం కోర్టుకు చేరింది. మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా 1960లో రాజ్యాంగ సవరణ చేసి కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్థాన్‌కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కచ్చ తీవుపై రాజ్యాంగ సవరణ చేయకుండా శ్రీలంకకు ఎలా అప్పగిస్తారని తమిళ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రతి ఎన్నికల్లో కచ్చతీవు పర్వం!
1974 తర్వాత తమిళనాడులో ప్రతీ ఎన్నికల్లో ఇదే కీలకాంశంగా మారుతోంది. గతంలో కరుణానిధి, జయలలిత మధ్య కూడా ఈ వ్యవహారంపై మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల తర్వాత మరుగునపడుతోంది. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చతీవు ప్రాంతంలో దాడులకు దిగుతుండటం, లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం,మత్స్యకారులను బందీలుగా పట్టుకోవడం లాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతుండగా వీటిని నివారించేందుకు కేంద్రం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తమిళ పార్టీలు కోరుతున్నాయి. వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి ఆ దీవిని భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈసారి బీజేపీ వంతు
తాజాగా కచ్చతీవు వ్యవహారాన్ని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తెరపైకి తీసుకురాగానే ప్రధాని మోదీ కాంగ్రెస్‌, DMKపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ఆయన ఎక్స్‌వేదికగా ఆరోపించారు. ఇది ప్రతి భారతీయుడిలో ఆగ్రహానికి కారణమైందన్న ఆయన దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపర్చేలా 75 ఏళ్లు కాంగ్రెస్‌ పనిచేసిందని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఆదివారం మేరఠ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉందని గుర్తు చేశారు. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైందని, కానీ అది ఎందుకూ పనికిరాదంటూ కాంగ్రెస్‌ శ్రీలంకకు ఇచ్చేసిందని ఆరోపించారు. ఆ మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నామని, తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినపుడు లంక అధికారులు అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తుకట్టిన డీఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై నోరెత్తడంలేదని మోదీ పేర్కొన్నారు.

'నాటి ప్రధానుల ఉదాసీనతే కారణం'
కచ్చతీవు వివాదంపై విదేశాంగమంత్రి జై శంకర్ కూడా స్పందించారు. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్న ఆయన, పార్లమెంట్‌లో, కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుందని గుర్తుచేశారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎంకు 21 సార్లు సమాధానమిచ్చానని వెల్లడించారు. నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారన్న జై శంకర్‌, మాజీ ప్రధాని నెహ్రూ దృష్టిలో ఇది చిన్న ద్వీపమని, దీనికి ప్రాముఖ్యతే లేదని భావించి వదిలించుకోవాలనుకున్నారని జైశంకర్‌ చెప్పారు. ఇందిరా గాంధీ కూడా ఇదే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, డీఎంకేపై కూడా జైశంకర్ విమర్శలు గుప్పించారు. ద్వీపాన్ని అప్పగించేటప్పుడు తమను సంప్రదించలేదని డీఎంకే చెప్పిందన్న జైశంకర్‌, కానీ ఆ అంశంపై తమిళనాడు ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉందన్నారు. ఈ అంశాన్ని ఎవరు దాచారనేదీ ఇప్పుడే తమకు తెలిసిందని, దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పని చేయాలని వెల్లడించారు.

బీజేపీపై కాంగ్రెస్ ఫైర్
కచ్చతీవు విషయంలో బీజేపీ తీరుపై తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలోనే కచ్చతీవు అంశాన్ని ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడుపై మోదీకి అంత శ్రద్ధే ఉంటే శ్రీలంక నుంచి దానిని వెనక్కి తీసుకురావాలని కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ సవాల్‌ విసిరారు. గత పదేళ్లుగా ఈ విషయంలో మోదీ విఫలమయ్యారని మండిపడ్డారు. తమిళ ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన బీజేపీ ఇలా దారి మళ్లించే వ్యూహాలు ప్రయోగిస్తోందని విమర్శించారు. శ్రీలంకతో సత్సంబంధాల కోసం చిన్న దీవిని అప్పగిస్తే. దానిపై రాజకీయం చేయడం ప్రధాని మోదీ స్థాయికి తగదని సీనియర్‌ నేత పి.చిదంబరం అన్నారు. మోదీ హయాంలో చైనా చొరబాట్లపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. కచ్చతీవుపై బీజేపీకు ఒక్కసారిగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని DMK అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. ఇటీవల బీభత్సం సృష్టించిన వరదలకు సాయం కింద రూ. 37 వేల కోట్లు కోరితే ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.