తెలంగాణ

telangana

Huzurabad By Election: సర్వత్రా ఉత్కంఠ.. హుజూరాబాద్ తెరాస అభ్యర్థి ఎవరు?

By

Published : Jul 20, 2021, 7:50 AM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election)లో గెలుపు కోసం గులాబీ పార్టీ అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేస్తోంది. ఓ వైపు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి క్యాడర్ ఈటల రాజేందర్(Etela Rajender) వైపు మొగ్గు చూపకుండా ప్రయత్నిస్తూ.. మరో వైపు అన్నివర్గాలను ఆకర్షించే ప్రయత్నిస్తోంది. అభ్యర్థిని ఖరారు చేయక పోయినప్పటికీ.. సీనియర్ నేతలను రంగంలోకి దించి.. విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఆచిచూచి వ్యవహరిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సమితి... కొత్త ప్రయోగం దిశగా పావులు కదుపుతోందని ప్రచారం సాగుతోంది.

Huzurabad By Election
హుజూరాబాద్​ ఉపఎన్నిక

రాష్ట్రంలోని అందరి దృష్టి హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad By Election)పై పడింది. ఇక్కడ ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను సమీకరించి వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందిస్తోంది. ఉపఎన్నికపై స్పష్టమైన అంచనాతో.. అన్నీ చూసుకున్న తర్వాతే ఈటల రాజేందర్​(Etela Rajender)ను పార్టీ నుంచి పంపించేందుకు తెరాస సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈటల శాసనసభ్యుడిగా రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ ఆమోదించారు. ఆ తర్వాత వెంటవెంటనే రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి క్యాడర్ ఈటల వెంట వెళ్లకుండా గులాబీ పార్టీ జాగ్రత్త పడింది. మంత్రి హరీశ్​ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెర వెనక మంత్రాంగం నడుపుతున్నారు. త్వరలో ఓ మాజీ మంత్రి తెరాసలో చేరేందుకు మంతనాలు జరుగుతున్నాయి. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు.

ఈటలపై మంత్రుల మాటల యుద్ధం

ఈటలకు సానుభూతి రాకుండా తెరాస జాగ్రత్త పడుతోంది. మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచే ప్రత్యక్షంగా, పరోక్షంగా విరుచుకుపడుతోంది. ఈటల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. మరోవైపు పార్టీకి, ప్రభుత్వానికి ద్రోహం చేశారని.. అందుకే వేటు వేశారని తెరాస జనాల్లోకి తీసుకెళ్లింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేందరూ హుజూరాబాద్​లో ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో గెలుపు, ఓటములపై ప్రభావం చూపే ఎస్సీ, బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నిస్తోంది.

అభ్యర్థి ఎంపికపై ఆచితూచి

అభ్యర్థి ఎంపిక విషయంలో అనేక సమీకరణలు చేస్తూ.. ఆచితూచి వ్యవహరిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరాసకు ఈటల స్థాయి బలమైన నేత లేరనే చెప్పవచ్చు. అయితే ఎన్నిక ఏదైనా కేసీఆర్ సర్కారు అభివృద్ధి, సంక్షేమాలే గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు వ్యక్తుల మధ్య ఉండవని... పార్టీల మధ్యేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని.. ఏ పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటాయన్నారు. తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిని ఈటల రాజేందర్ తన ఖాతాలో ఎలా వేసుకుంటారని.. ఆయన భాజపా ఏం చేసిందో మాత్రమే చెప్పాలంటున్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీని చూడాలనే కోణంలో ప్రచారం సాగుతోంది.

ఎస్సీ అభ్యర్థిని రంగంలోకి దింపుతారా..?

మరియమ్మ లాకప్ డెత్​పై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్​గా స్పందించి ఆమె కుటంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగం ప్రకటించటంతోపాటు.. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు, డీజీపీని స్వయంగా వెళ్లి పరామర్శించాలని ఆదేశించారు. దళిత బంధు పథకాన్ని ప్రకటించిన కేసీఆర్.. హుజూరాబాద్ నుంచే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దళిత బంధు కోసం వందల కోట్ల రూపాయలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వరంగల్ పర్యటనలో కేసీఆర్ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. రసమయి బాలకిషన్​కు సాంస్కృతిక సారథి ఛైర్మన్​గా మరోసారి నియమించారు. దళితులపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ, అభిమానం ఉందని చెప్పే దిశగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో హుజూరాబాద్​లో తెరాస ఎస్సీ అభ్యర్థిని రంగంలోకి దించబోతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

బీసీకి టికెట్​ ఇస్తే..?

ఉద్యమ, బీసీ నేతగా ఈటల రాజేందర్​కు ఉన్న పేరును దృష్టిలో ఉంచుకొని వివిధ కోణాల్లో సమీకరణలు చేస్తోంది. బీసీ గురుకులాలకు నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలకు చెందిన బీసీ నేత, తెతెదేపా మాజీ అధ్యక్షుడు ఎల్.రమణను ఇదే సమయంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒకవేళ బీసీని అభ్యర్థిగా రంగంలోకి దింపాల్సి వస్తే.. ఎల్.రమణను కూడా సిద్ధం చేయవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఓయూ విద్యార్థి నేత, తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​ యాదవ్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు.

ఎవరు ఊహించని అభ్యర్థి ప్రకటించవచ్చు

అభ్యర్థి విషయంలో తెరాస నాయకత్వం సరికొత్త ప్రయోగాన్ని చేస్తోందనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికల్లో చివరి నిమిషంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవిని పోటీకి దించి విజయం సాధించింది. అదే తరహాలో ఊహించని అభ్యర్థిని ప్రకటించవచ్చునని తెరాస వర్గాలు అంచనా వేస్తున్నారు. మరోవైపు మొదట్నుంచీ కేసీఆర్​తో ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్​ను కూడా పోటీకి దించవచ్చుననే ప్రచారం కూడా ఉంది. ఎప్పటిలాగే తెలంగాణ రాష్ట్ర సమితి హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్వేలు చేస్తోంది. ఇప్పటికే వివిధ కోణాల్లో పలు సర్వేలను చేసి నివేదికలు తెప్పించుకొని విశ్లేషిస్తోంది.

ఇదీ చదవండి:RS PRAVEEN KUMAR: గురుకులాలపై ప్రవీణ్‌ కుమార్ ముద్ర

ABOUT THE AUTHOR

...view details