తెలంగాణ

telangana

జపాన్ ​​సాంకేతికతతో ఆ గ్రామంలో 'మినీ ఫారెస్ట్' సృష్టి!

By

Published : May 22, 2021, 6:35 PM IST

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంలో మార్పులను చూసి తమిళనాడులోని ఓ గ్రామం తల్లడిల్లిపోయింది. భూగర్భజలాలు ఇంకిపోవడం వల్ల.. వరి, తృణధాన్యాలు పండిన పొలాలు.. బంజరు భూమిగా మారుతుంటే చూస్తూ ఉండలేకపోయారు స్థానికులు. ఆ ఊరికి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామ ప్రజలంతా ఏకమయ్యారు. 10వేల మొక్కల్ని నాటి ఆ ఊరిని ఓ 'మినీ ఫారెస్ట్​'లా తీర్చిదిద్దాలకున్నారు. ఆ ప్రణాళికను చక్కగా అమలు చేస్తూ పొరుగు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Plants, Ideal village
మొక్కల పెంపకం, ఆదర్శ గ్రామం

వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోవటం వంటి సమస్యలతో పెను ముప్పు వాటిల్లుతోంది. ఇలాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఓ చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతూ పొరుగు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఓ పల్లెటూరు. ఆ ఊరిని ఓ చిరు అడవిలా తీర్చిదిద్దేందుకు పూనుకుని.. 10వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గ్రామస్థులు. అందులో భాగంగా.. ఇప్పటివరకు 2వేల మొక్కలను నాటి.. ఓ చిన్నపాటి అడవినే సృష్టించారు. జపాన్ ​సాంకేతికతను ఉపయోగించి 'మినీ ఫారెస్ట్​'ను రూపొందించిన ఆ గ్రామంపై ప్రత్యేక కథనం.

సెమ్మని చెట్టిపాలియంలో నాటిన మొక్కలు

ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరిగిపోతున్న నీటి వనరులను చూసి.. తమిళనాడు- కోయంబత్తూర్​ జిల్లా అన్నూర్​ ప్రాంతంలోని సెమ్మని చెట్టిపాలియం గ్రామం తల్లడిల్లిపోయింది. దానికితోడు ఆ పరిసర ప్రాంతాల్లో గత పదేళ్లుగా ఇనుము, ఉక్కు కర్మాగారాలు పుట్టుగొడుగుల్లా పుట్టుకురావడం గమనించింది. కాలానుగుణంగా వర్షాలు లేకపోవడం, పశువుల పెంపకం నానాటికీ తగ్గిపోవడం వంటివి అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలిచివేశాయి. భూతాపంతో.. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.

మినీ ఫారెస్ట్

ఇదీ చదవండి:'దేశంలో 80% పల్లెలు వైద్యానికి దూరం'

జపాన్​​ సాంకేతికతను సాయంతో..

జరుగుతున్న పరిణామాలను పసిగట్టిన స్థానికులు.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు మనుగడ సాగించడం కష్టమనుకున్నారు. దీన్ని అధిగమించి ఆ ఊరిని మళ్లీ పచ్చదనంతో ముంచెత్తాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే దిశగా ముందడుగేశారు. జపనీయులు వాడే సాంకేతిక పరిజ్ఞానమైన మియావాకీ(జపాన్​ వృక్ష శాస్త్రజ్ఞుడి పేరు) పద్ధతిని అవలంబించారు. అలా.. ఇప్పటివరకు 2వేల మొక్కల్ని నాటి, ఆ గ్రామాన్ని ఓ సుందరమైన అడవిలా తీర్చిదిద్దటంలో తొలి విజయం సాధిచారు. సీతాఫలం, సిమర్​రౌబా గ్లాకా, పూవరాసన్​(పోర్షియా), నిమ్మ వంటి పలురకాల మొక్కలు నాటామని స్థానికులు తెలిపారు.

మినీ ఫారెస్ట్

ఇదీ చదవండి:'బాహుబలి' స్ఫూర్తితో విల్లు, బాణాల తయారీ

'మా గ్రామం ఓ నమూనాగా..'

"మా గ్రామాన్ని ఇతరులకు ఓ నమూనాగా మార్చాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. దాన్ని ఊరి ప్రజలందరి మద్దతుతో అమలు చేస్తున్నాం. తొలిదశలో రెండువేల మొక్కలను నాటాం. మేము చేపట్టిన ఈ పచ్చదనం కృషితో.. వర్షాలు, భూగర్భజలాలు మళ్లీ పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం మా ఊరి యువతకు మంచి ప్రేరణగా నిలుస్తోంది."

-పాకియరాజ్​, స్థానిక ఉపాధ్యాయుడు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా.. పట్టణ పంచాయతీ సహకారంతో ఆ మొక్కలకు కంచెలు వేయాలనుకున్నామని పాకియరాజ్​ చెప్పుకొచ్చారు.

మినీ ఫారెస్ట్

ఇదీ చదవండి:జీవజాతులకు పెను ముప్పు!

'చూస్తూ ఉండలేకపోయాం..'

"మా ఊళ్లో భూగర్భజలాలు 100 అడుగుల లోతుకు క్షీణించాయి. ఎంతో సారవంతమైన భూమి అంతా బంజర భూమిగా మారింది. ఒకప్పుడు వరి, ఇతర తృణధాన్యాలను సాగు చేసిన భూములిప్పుడు నివాస స్థలాలుగా మారాయి. ఈ పరిస్థితుల్ని అధిగమించి.. గ్రామంలో మళ్లీ పచ్చటి వాతావరణం నెలకొల్పాలనుకున్నాం. అందుకోసం ప్రజల సహకారంతో ఓ చిన్న అడవిని సృష్టించాలనుకున్నాం."

-రఘురమణ, స్థానికుడు

అలా తమ ప్రతిపాదనతో గ్రామస్థులంతా ఏకమై.. ఒక్కో వ్యక్తి ఒక మొక్కతో పాటు, ప్రతి ఇంటి నుంచి ఓ నీటి కుండ తేవాలని నిర్ణయించుకున్నామని రఘురమణ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఊరి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:మతి పోగొట్టే మానవత్వం!

పొరుగు గ్రామాలకు ఆదర్శంగా..

సెమ్మని చెట్టిపాలియం గ్రామస్థులు అవలంబించిన ఈ పథకం విజయవంతం కావడం వల్ల.. ఆ అటవి పునరుద్ధరణ నమూనాను అనుకరించేందుకు పొరుగు గ్రామాల యువకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. స్థానికుల ప్రయత్నాలతో ఆ గ్రామం త్వరలోనే ఓ పచ్చని అడవిలా, పక్షుల అభయారణ్యంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా.. ఊరు కోల్పోయిన పూర్వవైభవాన్ని మళ్లీ ఈ 'మినీ-ఫారెస్ట్​' ద్వారా తిరిగి దక్కుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి:బాలుడి అద్భుత బ్యాటింగ్​కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఫిదా

ABOUT THE AUTHOR

...view details