YSRCP Leaders Occupied Markapuram Crematorium: 'శ్మశాన వాటికనూ వదలని వైసీపీ నేతలు'.. సబ్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న మహిళలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 5:37 PM IST
YSRCP Leaders Occupied Markapuram Crematorium: ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ పార్టీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా పార్టీ అండదండలతో ఆక్రమించేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పెద్ద నాగులవరం రోడ్డులో ఉన్న దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేశారు. దీంతో అక్కడి మహిళలు, స్థానికులు సబ్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Women Blocking the Sub Collector Vehicle:తర తరాలుగా వాడుకుంటున్న శ్మశాన వాటిక స్థలాన్ని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని.. మార్కాపురంలోని పెద్ద నాగులవరం మహిళలు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాన్ని అక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. అదే అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ ముంగమూరు శ్రీనివాసులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ సేదు మాధవన్ కబ్జాకు గురైన స్థలం వద్దకు విచ్చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకుని సబ్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. తమ శ్మశాన వాటికను అక్రమార్కుల చెర నుంచి కాపాడాలంటూ నిరసన తెలిపారు. స్పందించిన సబ్ కలెక్టర్ భూమిని సర్వే చేయించి.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.