Young Man Suicide Attepmt Due to Police Harassments: నెల్లూరు జిల్లా సైదాపురం పోలీసుల కస్టడీలో ఉండగా ఆత్మహత్యకు యత్నించిన ఆకాష్ అనే దళిత యువకుడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వేధింపులతోనే స్టేషన్లో ఆకాష్ పురుగుల మందు తాగాడంటూ... కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. తన భార్య కనిపించడం లేదని, అందుకు ఆకాషే కారణమంటూ ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఆకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు విచారణ చేశారు. ఈ క్రమంలో స్టేషన్లో ఉండగానే ఆకాష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడన్న పోలీసులు.. ప్రాథమిక చికిత్స తర్వాత తిరుపతి స్విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆకాష్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, వారి బంధువులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత దీనిపై విచారణ చేయించిన ఎస్పీ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ నాగబాబు, కానిస్టేబుల్ వీరభద్రంపై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు.