Young Cricketer KS Bharat Honor Program: కేఎస్ భరత్ యువతరానికి స్ఫూర్తి అని.. క్రీడాకారులు అతన్ని ఆదర్శంగా తీసుకుని రాణించాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో యువ క్రికెటర్ కేఎస్ భరత్కు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. పై వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఏడు దశాబ్దాల ఏసీఏ క్రికెట్ చరిత్రలో మూడో టెస్ట్ క్రికెట్ ఆటగాడిగా భరత్ నిలిచాడని ఆయన ప్రశంసించారు. గతంలో ఆటగాళ్లు వాళ్ల సొంత డబ్బులతోనూ దాతల సహకారంతో క్రీడల్లో రాణించేవారన్నారు. ఏపీలో ఎంతో మంది క్రీడాభిమానులు తమ ఆస్తులను తాకట్టు పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించారన్నారు. ఏసీఏ(ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహించిందని ప్రసాద్ గుర్తుచేశారు. క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తే దేశానికి, రాష్ట్రానికి మరిన్ని పథకాలు తెచ్చిపెడతారని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. తన వద్ద శిక్షణ పొందిన వంశీ, శివ చరణ్, భరత్ ముగ్గురూ మంచి వికెట్ కీపర్లుగా రాణించారన్నారు. భవిష్యత్తులో కేఎస్ భరత్ కూడా క్రీడల్లో మరింత రాణించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో ప్రపంచ టెస్ట్ టీమ్లో సీనియర్లతో కలిసి ఆడటం చాలా గొప్పగా అనిపించిందని భరత్ సంతోషం వ్యక్తం చేశాడు. భవిష్యత్లో మరింత కష్టపడి మంచి స్కోర్ సాధించి భారత్ టీమ్లో మంచి క్రీడాకారుడిగా రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సన్మామ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రా రెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.