Yarapathineni Comments On Kasu Mahesh Reddy: మే 20వ తేదీన స్వాతంత్య్ర సమరయోధులైన జాతీయ బీసీ నాయకులను స్మరించుకుంటామని.. అయితే అదేరోజు కాసు బ్రహ్మానంద రెడ్డి వర్ధంతి కావటంతో ఆ రోజును వైఎస్సార్సీపీ పార్టీవాళ్లు బీసీ డేగా ప్రకటించుకోవటం విడ్డూరమని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బ్రహ్మానందం రెడ్డి విగ్రహం వద్ద బీసీ డేగా ప్రకటించుకున్నప్పుడు అక్కడ ఒక బీసీ నాయకుడు గురువాచారి తప్ప... ఎవరూ లేరని యరపతినేని విమర్శించారు.
కాసు మహేష్ రెడ్డి ప్రోద్బలంతో నియోజకవర్గంలో అధికారుల అక్రమ దందాలు పెట్రేగిపోయాయని.. మట్టి దందాలో వైసీపీ నాయకులు ఆక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాసు మహేష్ రెడ్డి గుండాలు దాచేపల్లి క్వారీలో పనిచేసే కార్మికులు కూలి డబ్బులు అడిగిన పాపానికి కడుపులోని పేగులు బయటకు వచ్చేలా చేసిన హత్యలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించాడు. పేదల మీద జరుగుతున్న దాడులను వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదనీ యరపతినేని హెచ్చరించారు. దీంతో పాటు వివేకనందరెడ్డి (బాబాయ్) హత్యలో ప్రధాన నిందితులను కాపాడుతూ పబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి కూడా త్వరలో జైలుకు వెళతాడని ఆయన తెలిపారు.
రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే గురజాల నియోజక వర్గంలో టీడీపీ నాయకులు సమిష్టి కృషితో పార్టీని గెలుపించుకుందామని.. కష్టపడి పనిచేసే నాయకులను, కార్యకర్తలను పార్టీ గుర్తు పెట్టుకుంటుందని యరపతినేని వెల్లడించారు.