Vijayawada Durga Temple Ghat Road Closed: భారీ వర్షాల కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు ద్వారా దర్శనాలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు, కార్లను అనుమతించడం లేదు. అదే విధంగా దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన బస్సులను కూడా నిలిపివేశారు. భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గం ద్వారా మాత్రమే అనుమతిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారి ఘాట్ రోడ్ మీద పడుతుండటంతో.. దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా ఘాట్ రోడ్డు ద్వారా భక్తుల రాకపోకలను నియంత్రించారు. ఈ రోజు ఉదయం కూడా ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారిపడ్డాయి. ఆ సమయంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కొండచరియలు జారిపడకుండా గతంలో.. ఐరెన్ మెష్ను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భారీ వర్షాల కారణంగా మెత్తని మట్టి, కొండచరియలు జారిపడుతున్నాయి. ఈ క్రమంలో మెట్ల మార్గం ద్వారా, లిఫ్ట్ ద్వారా అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా.. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు దుర్గ గుడి ఈవో భ్రమరాంబ తెలిపారు.