Somu Veerraju comments on CBN and BJP leaders Meet: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలవడాన్ని తాము తప్పు పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు సీనియర్ నాయకులు అని.. తమ పార్టీ అగ్రనేతలను, ముఖ్యులతో భేటీ కావడంలో తప్పు లేదని విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చెప్పారు. రాష్ట్ర నేతలకు కలయిక గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలన ప్రగతిపై 13 రకాల కార్యక్రమాలను రూపొందించి.. ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు ఆయన తెలిపారు. 26 జిల్లాల్లోనూ ఇంటింటికి వెళ్తామన్నారు. ఈ నెల కేంద్రం నుంచి పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రానున్నారని చెప్పారు. విశాఖకు హోంమంత్రి అమిత్షా... తిరుపతికి పార్టీ జాతీయ అధ్యక్షుల జేపీ నడ్డా... కర్నూలు, హిందుపురం తదితర ప్రాంతాల్లో దేవీసింగ్ చౌహాన్, మురళీధరన్ మరికొందరు ముఖ్యులు రానున్నారని పేర్కొన్నారు.