Sarva Siksha Abhiyan Employees Dharna Over Salary Hike: జీతాల పెంపుపై సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల 'వేడుకోలు' దీక్ష
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 10, 2023, 4:28 PM IST
Sarva Siksha Abhiyan Employees Dharna Over Salary Hike: రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్షా అభియాన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు.. ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 'వేడుకోలు' దీక్ష చేపట్టారు. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. పరిష్కరించాలంటూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి జగన్.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి.. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల ఆఖరిలో 'చలో ఎస్పీ కార్యాలయం' కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు.
UTF Leaders Babu Comments: కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన వేడుకోలు దీక్ష కార్యక్రమంలో యూటీఎఫ్ సంఘం నాయకులు పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యూటీఎఫ్ నాయకులు బాబు మీడియాతో మాట్లాడుతూ..''ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. సర్వ శిక్షా అభియాన్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏడు సంవత్సరాలుగా జీతాలు పెంచలేదు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పందించి.. వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించని పక్షంలో ఈ నెల చివరికల్లా 'చలో ఎస్పీ కార్యాలయం' ముట్టడి కార్యక్రమం చేపడతాం'' అని ఆయన అన్నారు.