Ramachandra Yadav complaint against minister Peddireddy corruption: ఆంధ్రప్రదేశ్ భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతిపై భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై తక్షణమే ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తూ..నేడు దిల్లీలో అమిత్ షాను కలిసి, తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
త్వరలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా..రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..''చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.35వేల కోట్లు దోచుకున్నారు. 2019కి ముందు ఆయన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించకుండా.. ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారు. ప్రభుత్వం నుంచి అక్రమంగా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుని, ప్రజాధనాన్ని దోచుకున్నారు. పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 17 మంది బినామీ డైరెక్టర్ల ద్వారా 60కిపైగా సూట్కేస్ కంపెనీలను సృష్టించారు. 2019 నుంచి 2023 వరకు చూస్తే కంపెనీ ఆదాయం కొన్ని వందల రెట్లు చూపించారు. మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు వివరించాను. తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశాను. పెద్దిరెడ్డి అవినీతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో దర్యాప్తు చేయించాలని కోరాను. పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎంను నేను డిమాండ్ చేస్తున్నాను. త్వరలోనే ఎన్నికల సంఘానికి మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై ఫిర్యాదు చేస్తాను. మంత్రి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తాను'' అని ఆయన అన్నారు.