Dharna in Guntur District :రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాలు తమకు వద్దని.. తాము నివాసమున్న ప్రాంతాల్లోనే పట్టాలు ఇవ్వాలని కోరుతూ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో సచివాలయం వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఉండవల్లికి చెందిన సుమారు 30 మందికి మంగళగిరి మండలం నిడమర్రులో ఇటీవల సెంటు స్థలాలు కేటాయించారు. అక్కడ సరైన వసుతులు లేవని.. పాములు, కొండచిలువలు వస్తున్నాయని మండిపడ్డారు. పిల్లలను చదివించుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆ స్థలాలు వద్దని.. ప్రస్తుతమున్న ప్రాంతంలోనే పట్టాలివ్వాలని లబ్ధిదారులు నిరసన తెలిపారు. సెంటు స్థలాలు వద్దంటూ నినాదాలు చేశారు. సెంటు స్థలాల పేరుతో ప్రభుత్వం తమను మోసం చేసిందని లబ్దిదారులు ఆరోపించారు. వీరికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపి.. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా సెంటు లబ్దిదారులతో కలసి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని సీపీఎం నేతలు చెప్పారు.