Chandrababu fire on CM Jagan: జగన్మోహన్ రెడ్డి ముందు బకాసురుడు కూడా తక్కువేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్రెడ్డి చరిత్రలో ఉన్న రాక్షసులందరినీ మించిన రాక్షసుడని అన్నారు. ప్రపంచంలో ఉండే వింత జంతువుల కంటే వింత జంతువు జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. అవనిగడ్డకు చెందిన వైఎస్సార్సీపీ నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్.. చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. సుభాష్ చంద్రబోస్ అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్తో పాటు అవనిగడ్డ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. టీడీపీ అవనిగడ్డ ఇన్ఛార్జ్ మండలి బుద్ధ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం మారకపోతే జీవితాలు మారవనే వాస్తవం గ్రహించిన వైఎస్సార్సీపీ నేతలు.. తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడితే రాష్ట్రం గెలిచినట్లని చెప్తున్నానన్నారు. రాష్ట్రం గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ మారి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరూ కష్టపడాలని చంద్రబాబు సూచించారు. గొడవలు అంటే తెలియని ప్రశాంత నగరంగా ఉండే విశాఖలో ఇప్పుడెవరైనా అడుగుపెట్టాలంటే భయపడుతున్నారన్నారు. ప్రారంభానికి ముందే పోలవరాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టారని, 5 ఏళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.