Minister Dharmana Prasada Rao Warns to Public: పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వానికి... అండగా నిలవకపోతే మీరే నష్టపోతారని ధర్మాన ప్రసాదరావు ప్రజలను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని తంగివానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. గత నాలుగు ఎన్నికల్లో ఎప్పుడూ పెద్దపాడు, తంగివానిపేట, వానవానిపేట, శాస్త్రులపేటల్లో.. తనకు మెజార్టీ రాలేదన్నారు. అయితే తనను అభివృద్ధి పనులు చేయండని అడిగే హక్కు ఆ ప్రాంతం ప్రజలకు లేదని ధర్మాన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆయా గ్రామాల అభివృద్ధికి లక్షలు ఖర్చు చేస్తున్నానన్నారు. గతంలో తాను అధికారంలో ఉండగా ఎంతోమంది పేదలకు ఇళ్లు ఇచ్చామన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఈ సారి సైతం ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించిన తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయ్యాలో అని మహిళలు తమ భర్తలను ప్రశ్నించాలని పేర్కొన్నారు. అనేక మంది తెలుగుదేశం నేతలకు భయపడి సమావేశానికి కూడా రాలేదని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా మెుదలుకొని మంత్రిగా.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కొందరు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ టీడీపీకి ఓటు వేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.