ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Locals Repaired Road: 'మూన్నెళ్ల ముచ్చటేనా..' వర్షానికి కొట్టుకుపోయిన మట్టిరోడ్డు.. మరమ్మతుకు చెమటోడ్చిన గిరిజనులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2023, 6:36 PM IST

Locals_Repaired_Road

Locals Repaired Road: పార్వతీపురం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని అక్కడ గిరిజనులు కోరుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితం శ్రీధరపు గిందే అనే మహిళ గ్రామంలోనే ప్రసవం అయ్యి బిడ్డను కోల్పోయింది. తరువాత ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో డోలి కట్టి 13 కిలోమీటర్లు కొండ ప్రాంతంలో నడిచి కిందకు తీసుకువచ్చి అక్కడ నుంచి పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. దీనిపై అప్పట్లో వచ్చిన పత్రికా కథనాలకు మానవ హక్కుల సంఘం స్పందించి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ లపై మండిపడింది. దీంతో అప్పట్లో పనిచేస్తున్న ఐటీడీఏ పీఓ లక్ష్మీశా ఆ గ్రామానికి కాలినడకన వెళ్లి వారి కష్టాలను విని స్పందించారు. రహదారిని మంజూరు చేశారు. పనులు కూడా ప్రారంభించారు. అయితే చిలక మెండంగి నుంచి 3 కిలోమీటర్ల మేర పనులు చేసి నిలిపివేశారు. గతేడాది ఎస్పీ ఆదేశాలతో మక్కువ పోలీసులు కొంతమేర పనులు చేశారు. ఆ తర్వాత ఐటీడీఏ అధికారులు స్పందించి పనులు ప్రారంభించారు. మూడు నెలల క్రితం రహదారి పనులు పూర్తయ్యాయి. అయితే కేవలం మట్టి రోడ్డు కావడంతో.. ఇటీవల కురిసిన వర్షాలకు మొత్తం కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకే కాక పాదచారులు నడవడానికి కూడా వీలులేకపోవటంతో సిరివరతో పాటు పరిసర గ్రామస్థులు వచ్చి శ్రమదానంతో మూడు రోజులుగా మట్టిరోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details