Lawyers Demand For High Court In Kurnool : కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఏమైందంటూ న్యాయవాదులు ప్రశ్నించారు. కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. 'అక్కడ.. ఇక్కడ.. రాజధాని ఎక్కడ, రాయలసీమ ద్రోహి జగన్, సీఎం డౌన్ డౌన్, మాకు న్యాయం కావాలి' అంటూ న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని, దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు కోసం లోకేశ్ యాత్రకు అడ్డు తగిలిన వైఎస్సార్సీపీ నాయకులు.. ఇచ్చిన హామీ అమలు చేయకుండా నేడు కర్నూలు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ను ఎందుకు అడ్డుకోలేదని వారు నిలదీశారు. అందరికీ కనపడేలా హైకోర్టు నిర్మిస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతానికి హైకోర్టు రాకపోతే.. తాము చేయబోయే ధర్నాలకు, దీక్షలకు త్యాగాలకు జగన్ కారణం అవుతారని వారు హెచ్చరించారు. వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంలో స్పష్టత ఇవ్వాలని లాయర్లు డిమాండ్ చేశారు.