Kuruba Community Leaders Angry on Minister : 'రాజకీయాల కోసం చిచ్చుపెడితే ఊరుకోం'... మంత్రికి కురుబ సంఘం నేతల హెచ్చరిక
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 22, 2023, 4:13 PM IST
Kuruba Community Leaders Angry on Minister Ushasree Charan:వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కురుబ కులస్తుల మధ్య చిచ్చు పెడుతోందని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు, కనకదాస కళ్యాణ మండపం జిల్లా అధ్యక్షుడు రాజేష్ అన్నారు. అనంతపురం ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. రెండేళ్ల కిందట కురుబ కులస్తులు పెద్దల సమక్షంలో జిల్లా కురుబ సంఘం ఎన్నికైందన్నారు. కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాజహంస శ్రీనివాసులను అప్పుడు ఎన్నుకున్నామని వెల్లడించారు. రాజహంస శ్రీనివాసులు పదవీకాలం ఇంకా సంవత్సరం ఉండగా.. మంత్రి ఉషశ్రీ చరణ్ తన రాజకీయ స్వలాభం కోసం మరో సంఘాన్ని ఎంపిక చేసి.. కురుబ కులస్తుల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందని అన్నారు.
రాజహంస శ్రీనివాసులు ఇప్పటివరకు కురుబల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశారు.. విద్యార్థులు చదువులో రాణించాలని అలాగే ఉద్యోగాలు సాధించాలని వారి అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేస్తున్నారని తెలిపారు. రాజహంస శ్రీనివాసులకు కులస్తుల్లో వస్తున్న ఆదరణ చూసి మంత్రి ఉషశ్రీ చరణ ఓర్వలేక ఇలాంటి కుట్ర చేసే కార్యక్రమాలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉషశ్రీ చరణ్ కుట్రపూరిత ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. కులస్తుల అభివృద్ధి కోసం పాటుపడే వారే సంఘం అధ్యక్షులుగా ఉంటారన్నారు. రాజకీయ స్వలాభం కోసం కులాల్లో చిచ్చు పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.