Rudramkota Villagers Living in Hills Last Five Days : వర్షాలు కురిస్తే.. రైతన్నకు సంతోషం! కానీ వారు మాత్రం గత ఐదు రోజుల నుంచి ఎనలేని వెతలను అనుభవిస్తున్నారు. గోదారి పోటెత్తితే తాము కొండలెక్కాల్సిందేనని ఆ 42 గ్రామాల ప్రజలు కన్నీటిపర్యంతం అవుతున్నారు. చీకట్లో గుట్టల మీద బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ప్రమాదకరంగా నీటిమట్టం పెరుగుతూ ప్రవహిస్తుడడంతో ముంపు ప్రాంతాలైన 42 గ్రామాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గోదావరికి అత్యంత సమీపాన నివసిస్తున్న గోదావరి ముంపు ప్రాంతమైన ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే అవకాశం లేక కొండ గుట్టల మీద పరదాలు వేసుకుని ఉంటున్నారు. తాము వచ్చి ఐదు రోజులు అయినప్పటికీ ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేదని బాధితులు వాపోతున్నారు. మరుగుదొడ్లు కూడా లేవని మహిళలు ఆవేదన చెందారు. చిన్న పిల్లలు, వృద్ధులతో గుట్టల మీద నివాసం ఉంటున్న తమకు ప్రభుత్వం ఎటువంటి సహయం అందించలేదని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు.
"మేము కొండ గట్టుల పైకి వచ్చి ఐదు రోజులు అయ్యింది. మేము ఉండటానికి పరదాలు, రాత్రి పూట ఉండటానికి కొవ్వొత్తులు, కనీసం తాగటానికి మంచి నీళ్ల ప్యాకెట్ ఇవ్వలేదు. ఏ అధికారి మా పరిస్థితి తెలుసుకొవడానికి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయం అందలేదు."- బాధితులు