ఏపీలో పోలీసుల వ్యవహారం కంచే చేను మేసిన చందం - మాజీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 1:17 PM IST
Former DGP Bhaskar Rao on Police Department: ఆంధ్రప్రదేశ్లో చిన్నస్థాయి పోలీస్ నుంచి ఉన్నతస్థాయి పోలీసుల వరకూ హింసాత్మకంగానూ, అహింసగానూ వారిని వాడుకుంటారని మాజీ డీజీపీ ఎంవీ భాస్కర రావు ఆరోపించారు. అధికారులను వేధించే స్థాయిలో రాజకీయ వ్యవస్థ ఉందని ఆయన ఆవేదన చెందారు. ఏపీలో పోలీసుల వ్యవహారం కంచే చేను మేసిన చందంగా తయారైందని అభిప్రాయ పడ్డారు. పరిస్థితులు మారుతున్న కొద్దీ ఐపీఎస్ అధికారుల్లో వెన్నెముక లేకుండా పోతోందని ఎంవీ భాస్కర రావు ఆందోళన వ్యక్తం చేశారు.
Bhaskar Rao Comments: ''అన్ని వ్యవస్థల మాదిరిగానే పోలీసు వ్యవస్థ ఉంటుంది. సమాజంలో మార్పులకు అనుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి. మంచి చేయాలని ఉద్దేశం ఉన్నవాళ్లు కూడా చెడుగా మారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను గృహనిర్బంధాలు చేయాలని ఎవరు చెబుతున్నారు?. కొంతమంది పోలీసులు పెద్దవాళ్లు మెచ్చుకుంటారనో, ఏదో ఆశించో గృహనిర్బంధాల వంటి పనులు చేస్తున్నారు. అది సరైన పద్దతి కాదు. చాలా మంది ఐపీఎస్ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. బదిలీలకు భయపడటం, మంచి పోస్టింగు కోసం వెంపర్లాడటం వల్ల రాజకీయ అధినేతలతో రాజీ పడుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే ప్రజలు గళమెత్తాల్సిన అవసరం ఉంది.'' అని మాజీ డీజీపీ ఎంవీ భాస్కర రావు అన్నారు.