Farmers Protest in Mandadam: రాజధాని అమరావతిలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలపై రైతులు రోడ్డెక్కారు. గుంటూరు జిల్లా మందడం గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ స్థలాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమ స్థలాల్లో అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. జోరువానలోనూ రోడ్డుపైనే రైతులు బైఠాయించారు. అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. CRDA కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సోమవారం అర్ధరాత్రి రాజధానిలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన అనుచరులు మందడంలో మట్టి తవ్వుతుంటే రైతులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి అనుచరులు రైతులపై దాడికి యత్నించడంతో మంగళవారం ఉదయం ధర్నాకు దిగారు. ప్రభుత్వం చర్యలు తీసుకునేంతవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. రైతుల రోడ్డుపైకి రావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లారు.