CPM Padayatra for Kurnool District Development: కర్నూలు జిల్లా అభివృద్ధికై సీపీఎం ఆధ్వర్యంలో మహా పాదయాత్ర కొనసాగుతోంది. ఆదోని పట్టణం నుంచి కర్నూలు జిల్లా కేంద్రం వరకు 100 కిలోమీటర్లు మేర పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రారంభమైన యాత్ర.. 5 రోజుల పాటు కొనసాగి.. కర్నూలుకు చేరుకుంటుంది. ఈ మహా పాదయాత్రలో సీపీఎం కేంద్ర కమిటీ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ పాల్గొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని.. జిల్లా విభజన తరువాత పశ్చిమ కర్నూలు వెనకపడిపోయింది.. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరింత వెనకబడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత పేద జిల్లాగా మిగిలిపోయిందని అన్నారు. జిల్లాలో సాగునీరు, తాగునీరు లేవు.. రోడ్లు, వైద్య సదుపాయాలు, విద్యా విధానం లేదని విమర్శలు చేశారు. కర్నూలు అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. రాజకీయ నాయకులు చిత్త శుద్ధితో పని చేయడం లేదని.. ఇప్పుడు పోరాడకుంటే పశ్చిమ జిల్లా ఎడారిగా మారుతుందని.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.