BUILDING WORKERS: భవన నిర్మాణ రంగ కార్మికుల పెండింగ్ క్లెయిములు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నామని ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడాల రమణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని 20వ తేదీన చలో విజయవాడ పేరుతో మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అందులో అన్ని జిల్లాల నుంచి భవన నిర్మాణ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996 దేశవ్యాప్తంగా అమలవుతున్నా.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చట్ట అమలుపై తీవ్ర నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి నవరత్నాలకు మళ్లించిన నిధులను తక్షణమే బోర్డుకు జమ చేయాలన్నారు. గతంలో బోర్డు ద్వారా అమలు చేసిన సంక్షేమ పథకాలను కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జూన్ 20వ తేదీలోగా ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.