ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమ అరెస్టులపై కాదు - అంగన్వాడీ సమస్యలపై దృష్టిపెట్టండి : చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 3:54 PM IST

Chandrababu Supports Anganwadis Strike

Chandrababu Supports Anganwadis Strike: అంగన్వాడీల సమస్యలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. అంగన్వాడీలు సమస్యల పరిష్కారం కోసం 11రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం జగన్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. సేవకు ప్రతిరూపంగా ఉన్న అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి, చిత్తశుద్దితో ప్రయత్నం చేయకపోగా ఆందోళన చేస్తున్న వారిని అణిచివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్వాడీల కష్టాన్ని, సేవను తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి 2014నాటికి 4,200 రూపాయలు ఉన్న వేతనాన్ని 10వేల500 రూపాయలకు పెంచామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల కష్టాలు మొదలయ్యాయని చంద్రబాబు అన్నారు. తాజాగా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచలేదన్నారు. అర్థం లేని ఆంక్షలు పెట్టి వారి సంక్షేమ పథకాలకు కోత పెట్టారని ఆరోపించారు. దీనిపై సమ్మె చేస్తుంటే విచ్చిన్నం చేయడానికి పోలీసులు, వైసీపీ నేతలు అనుసరిస్తున్న తీరు నివ్వెరపరిచిందన్నారు.

న్యాయ బద్దమైన డిమాండ్లతో 11 రోజులుగా ఆందోళన చేస్తుంటే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం నిరంకుశత్వమే అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లి ఎన్ఆర్ఐ యువకుడిని అరెస్టు చేయడంపై పెట్టిన శ్రద్ద, అంగన్వాడీ సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోతుందని ప్రశ్నించారు. వీటి ద్వారా జగన్ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటో ప్రజలకు అర్థం అవుతుందన్నారు. ప్రభుత్వం అక్రమ కేసులు, నోటీసులు, వేధింపుల కోసం వెచ్చిస్తున్న సమయాన్ని, సమాజానికి సేవ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై పెట్టాలని చంద్రబాబు హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details