Fishermen Boat Missing At Kakinada : కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాలు భయపెడుతున్నాయి. వరుసగా బోటు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో మూడు పడవలు బోల్తాపడ్డాయి. ఉప్పాడకు చెందిన కొంతమంది మత్స్యకారులు బోటుపై తెల్లవారు జామున సముద్రంలో వేటకి వెళ్లి.. తమ వేటను ముగించుకుని తిరిగి తీరానికి చేరుకుంటుండగా రాకాసి కెరటాలు పెద్ద ఎత్తున విరుచుకు పడ్డాయి. వాటి తీవ్రతకు పడవ ఉన్నట్టుండి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా.. కొండయ్య అనే మత్స్యకారుడు సముద్రంలో గల్లంతు అయ్యాడు. ఉప్పాడ తీరంలో గడిచిన రెండు రోజుల్లో మూడు పడవ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హార్బర్ నిర్మాణంలో భాగంగా సముద్రంలోకి వేసిన గట్టు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని మత్యకారులు తెలిపారు. మూడు పడవ ప్రమాదాలు కారణంగా సుమారు రూ. 20 లక్షల మేర నష్టం వాటిల్లిందని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.