Bear Trapped in Cage at Shikaram in Srisailam: శ్రీశైలంలో సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. శిఖరేశ్వరం సమీపంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు బంధించారు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆలయం పైకి వెళ్లే మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన బోనులో అది చిక్కింది. బోన్లో చిక్కిన ఎలుగుబంటిని అర్ధరాత్రి వెలుగోడుకు తరలించారు.. అక్కడ అటవీ ప్రాంతంలో దానిని వదిలి వేయనున్నారు. శ్రీశైలంలో కొద్దిరోజుల నుంచి శిఖరం దగ్గర ఎలుగుబంటి సంచరిస్తోంది. అక్కడి శిఖరేశ్వరుడికి భక్తులు సమర్పించిన ప్రసాదాలు తినడానికి వస్తున్నట్లు గుర్తించారు. ఎలుగుబంటి సంచారం గురించి తెలియగానే అటవీశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శిఖరేశ్వరం సమీపంలో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎలుగుబంటి బోనులో చిక్కింది. ఆహారం కోసం వచ్చిన ఎలుగుబంటి బోనులో చిక్కుకుంది. బంధించిన ఎలుగుబంటిని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చాంగు పరిశీలించారు. తిరుపతిలో జరిగిన ఘటనల దృష్ట్యా శ్రీశైలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఎలుగును పట్టుకోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.