ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 4:58 PM IST

Amaravati_Inner_Ring_Road_Case

Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్ట్ రిజర్వు చేసింది. ఈ కేసులో ఇరుపక్షాల న్యాయవాదులు శుక్రవారం లిఖితపూర్వక వాదనలు దాఖలు చేశారు. చంద్రబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాటిని పరిశీలించిన హైకోర్టు నాయమూర్తి చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ఎలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలను నారా లోకేశ్‌ ఉల్లంఘించారని సీఐడీ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆయన లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలపై అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా లోకేశ్‌ న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేశారు. 
ఈ కేసులో 14వ పేరుగా నమోదైన లోకేశ్‌, దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ తరఫు న్యాయవాదులు రెండు మెమోలు దాఖలు చేశారు. దీనిపై టీడీపీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయని, కేసుకు సంబంధం లేని వివరాలను సీఐడీ ప్రస్తావించి- వాటిని కోర్టు ముందు ఉంచిందంటూ ఆ మెమోపై శుక్రవారం అభ్యంతరం తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఆదేశాల మేరకు లిఖితపూర్వకంగా ఇవాళ తమ అభ్యంతరాలను న్యాయవాదులు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details