Funeral of pet dog in Hindu tradition: తిరుపతిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పెంపుడు శునకం మృతి చెందటాన్ని జీర్ణించుకోలేని యజమాని.. హిందూ సంప్రదాయంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న కుక్క మరణించటంతో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ శునకంతో తమకెంతో అనుబంధం ఉందని, శునకం మరణించిన వార్త తమ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పెంపుడు శునకం విక్కీని.. యజమాని తాళ్లపాక దాము వైద్యం నిమిత్తం తిరుపతి పశు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. కాగా.. అక్కడ చికిత్స పొందుతూ కుక్క మరణించింది. అయితే ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన పెంపుడు శునకం మృతి చెందిందని యజమాని దాము ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఘటనపై పశువైద్య కౌన్సిల్, కలెక్టర్, పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం హిందూ సంప్రదాయంలో తన పెంపుడు శునకం విక్కీకి అంత్యక్రియలను నిర్వహించారు.