ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముప్పై మంది ముఖ్యమంత్రులలో అత్యంత ధనవంతుడు సీఎం జగనే: తులసి రెడ్డి

By

Published : Mar 1, 2023, 3:42 PM IST

PCC Working President Thulasi Reddy interesting comments on CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులలో అత్యంత ధనవంతుడు జగన్ మోహన్ రెడ్డినే అని పేర్కొన్నారు. ఈ మూడు సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్ బ్లాక్ మనీ, వైట్ మనీ కలిపితే దేశంలోనే అదానీ, అంబానీల కంటే మించిన ధనవంతుడుగా జగన్ మోహన్ రెడ్డి లిస్ట్‌లో ఉంటారని తెలిపారు.

Tulsi Reddy
Tulsi Reddy

Tulasi Reddy interesting comments on CM Jagan: పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసి రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర విమర్శలు చేశారు. 'బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత' అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలకం ఉందంటూ సైటర్లు వేశారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడినా.. తాను పేదవాడినని.. పేదల ప్రతినిధినని.. ప్రతిపక్షాలు పెత్తందారుల ప్రతినిధులంటూ.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకనొక దశలో అబద్దాలు-జగన్ మోహన్ రెడ్డి కవల పిల్లలా అనే ఆశ్చర్యం కలుగుతుందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులలో అత్యంత ధనవంతుడుగా నెంబర్ 1 స్థానంలో ఉన్నది జగన్ మోహన్ రెడ్డేనని తులసి రెడ్డి అన్నారు. అత్యంత పేదరాలుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లిస్ట్‌లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకముందే అత్యంత సంపన్నుడుగా ఉన్నాడని.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడు సంవత్సరాల 10 నెలల కాలంలో ఆయన బ్లాక్ మనీ, వైట్ మనీ తీసుకుంటే దేశంలోనే అదానీ, అంబానీల కంటే మించిన ధనవంతుడిగా జగన్ మోహన్ రెడ్డి లిస్ట్‌లో ఉంటారని అనడంలో ఏమాత్రం సందేహం లేదని వ్యాఖ్యానించారు. విశ్వసనీయతకు ఆయన చిరునామా అని.. మాట మీద నిలవడం ఆయన ప్రత్యేకత అని.. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేశామని.. జగన్ చెప్పుకోవటం చాలా సిగ్గుచేటన్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని తులసి రెడ్టి ఆగ్రహం దుయ్యబట్టారు.

జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, ప్రజల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు.. ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. మాట తప్పడం ఆయన దినచర్య అని, విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తిగా జగన్ రెడ్డి ముందుకుసాగుతున్నారని.. మేనిఫెస్టో అనేది ఆయన దృష్టిలో అదొక చిత్తు కాగితం అని తులసి రెడ్డి వివరించారు. నవరత్నాలకు దిక్కులేక.. కొన్ని గులకరాళ్లు, మరికొన్ని గుండ్రాళ్లు, ఇంకొన్ని రంగురాళ్లు అయ్యాయని ఆయన గుర్తు చేశారు. రైతు భరోసాతో రైతుల ఆశలు తీవ్ర నిరాశలుగా తయారయ్యాయని.. సున్నా వడ్డీకి సీఎం జగన్ సున్నం పెట్టాడని తులసి రెడ్డి విమర్శించారు.

అనంతరం ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ అయిందని.. విద్యా దీవెన విద్యకు శాపం అయిందని.. 25 లక్షల ఇళ్లకు గాను 25 వేల ఇళ్లను కూడా నిర్మించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. మద్యపానం నిషేధం మద్యపాన నిషాగా, జగనన్న త్రాగండి, ఊగండి పథకంగా తయారైందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో అబద్దాలను చెప్పడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందని అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసి రెడ్డి హితవు పలికారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details