ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంచాయతీ ఖాతాలు ఖాళీ.. ఏకగ్రీవ నిధులూ విద్యుత్తు ఛార్జీలకే!

By

Published : Apr 2, 2023, 9:24 AM IST

Funding problem for Gram Panchayats: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయాయి.. పంచాయతీలకు షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. నిధులు విడుదల చేయాల్సిన.. రాష్ట్ర ప్రభుత్వమే దిక్కుతోచని స్థితిలో పడేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.. సర్పంచులది. రాష్ట్రంలో ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించిన ప్రోత్సాహక నిధులు కాస్తా విద్యుత్తు ఛార్జీల బకాయిలకు వెళ్లిపోయాయి. అధికారుల చర్యలతో సీఎం సొంత జిల్లా వైఎస్సార్​ జిల్లాలోని అనేక పంచాయతీ ఖాతాలు కూడా ఖాళీ అయ్యాయి.

Funding problem for Gram Panchayats
Funding problem for Gram Panchayats

పంచాయతీ ఖాతాలు ఖాళీ.. ఏకగ్రీవ నిధులూ విద్యుత్తు ఛార్జీలకే!

Funding problem for Gram Panchayats: రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు కేటాయించిన ప్రోత్సాహక నిధులు కాస్తా విద్యుత్తు ఛార్జీల బకాయిలకు చెల్లిపోయాయి. అధికారుల చర్యలతో సీఎం సొంత జిల్లా అయిన వైఎస్సార్​ జిల్లాలోని అనేక గ్రామాల పంచాయతీ ఖాతాలు కూడా ఖాళీ అయ్యాయి. వచ్చిన ఆర్థిక సంఘం నిధులను మొత్తం విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేయడంతో గ్రామపంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ప్రోత్సా హక నిధులతో కొన్ని ముఖ్యమైన పనులైనా చేయిద్దామని ఆశపడిన సర్పంచులు.. ఖాతాల్లో నిధులు కనిపించక ఆందోళన చెందుతున్నారు.

తెలిసేలోపే ఖాతాలు ఖాళీ..రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమైన 2,001 పంచాయతీలకు ప్రభుత్వం ఏడాది క్రితం 134 కోట్ల రూపాయలు ప్రోత్సాహక నిధులు విడుదల చేసింది. 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 5 లక్షలు, 2,001 నుంచి 5,000 లోపు ఉన్న వాటికి 10 లక్షలు, 5,001-10,000 లోపు వాటికి 15 లక్షలు, 10,000కు మించి జనాభా కలిగిన పంచాయతీలకు 20 లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. వాటిని సాధారణ నిధుల ఖాతాకు జమచేసినట్లు అధికారులు ప్రకటించినా.. కొన్ని జిల్లాల్లో మాత్రం పంచాయతీల పేరుతో ఉన్న ఆర్థిక సంఘం నిధుల పీడీ ఖాతాల్లో వేశారు. తర్వాత వాటిని విద్యుత్‌ బకాయిలు కింద సర్దుబాటు చేశారు. వైఎస్సార్​ జిల్లాతో పాటు.. అన్నమయ్య జిల్లాల్లో 120కి పైగా పంచాయతీల్లో సర్పంచులకు ప్రోత్సాహక నిధులు వచ్చాయి అనే విషయం తెలిసేలోపే పీడీ ఖాతాలు ఖాళీ అయ్యాయి.

దాదాపు పది జిల్లాల్లో ఇలానే.. ప్రోత్సాహక నిధులను విద్యుత్‌ బకాయిలకు సర్దుబాటు చేసిన విషయాన్ని జిల్లా అధికారులు కొందరు.. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఈ విషయం ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చినా.. దాదాపు పది జిల్లాల్లో ఇలాంటి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. నిధుల సర్దుబాటు విషయం సర్పంచులు చెబుతున్నా.. జిల్లా అధికారులు ధ్రువీకరిస్తున్నా.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఏకగ్రీవంగా ఎన్నికైన అన్ని పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని చాలా వాటికి రెండు ఏళ్ల అయినా ఇంకా నిధులు విడుదల చేయలేదు. గ్రామాల్లోని అభివృద్ధి పనులు చేయడానికి నిధుల కోసం సర్పంచులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అసలు జిల్లాల నుంచి పంచాయతీలకు విడుదల చేయడం లేదా.. లేక కమిషనర్ కార్యాలయం నుంచే కేటాయిచడం లేదా.. అనే దానిపై సర్పంచులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదంవడి:

ABOUT THE AUTHOR

...view details