ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయనగరం..మరింత కట్టుదిట్టం..!

By

Published : Apr 27, 2020, 11:06 AM IST

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కేసులు నమోదు కావటంతో విజయనగరం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్క జిల్లాలనుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. సరిహద్దుల్లో పటిష్ఠంగా నిఘా వేశారు.

vijayanagaram district
విజయనగరం..మరింత కట్టుదిట్టం..!

రాష్ట్రంలోనే గ్రీన్‌ జోన్‌ పరిధిలో ఒక్క విజయనగరమే నిలిచింది. దీన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం శ్రమిస్తోంది. తాజాగా పక్కనే ఉన్న శ్రీకాకుళంలో కేసులు నమోదవ్వటంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దులను పూర్తిస్థాయిలో మూసేశారు. మరింత నిఘా ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కొంతవరకు రాకపోకలు జరిగాయి. తాజాగా శ్రీకాకుళంలో కేసులు వెలుగులోకి రావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎవరినీ అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప ఇతర సమయాల్లో వస్తే కచ్చితంగా జైలుకు పంపుతామని ఎస్పీ బి.రాజకుమారి హెచ్చరించారు.

మూడువేల మందితో

నాలుగు అంతర రాష్ట్ర, ఎనిమిది అంతర జిల్లాల, 28 అంతర్గత చెక్‌పోస్టులతో సుమారు మూడువేల మంది పహారా కాస్తున్నారు. ఈ చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని సీఐ పర్యవేక్షించనున్నారు. ఇకపై ఎవరు రావాలన్నా, పోవాలన్నా నేరుగా ఎస్పీతో సంప్రదించాకే అనుమతులు ఉంటాయి.

వివిధ దేశాల నుంచి ఇక్కడకు...

వివిధ దేశాల నుంచి 434 మంది ఇక్కడకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా శ్రీకాకుళంలో కేసుల తీరు నేపథ్యంలో ఒకసారి వీరందర్నీ పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 2,568 అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించారు. నెగెటివ్‌ వచ్చినా వీరిపై దృష్టి సారించనున్నారు

18 ట్రూనాట్‌ కిట్లు..

కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు 13 ట్రూనాట్‌ కిట్లను జిల్లాకు పంపిణీ చేసింది. మరో అయిదు త్వరలో రానున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు పదివేల మంది వరకు వైద్యాధికారులు, సిబ్బందిని కరోనా సేవలకు ఉపయోగించుకుంటున్నాయి.

సరిహద్దుల వద్దే తనిఖీలు

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల వద్దే తనిఖీలు చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని డీఎంహెచ్‌వో తెలిపారు. ఇందుకు అవసరమైన వైద్య సిబ్బందిని, కిట్లను ఆయా ప్రాంతాలకు తరలించామని అన్నారు. అనుమానాలుంటే జిల్లా కేంద్రాసుపత్రికి తరలించి మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని ఎస్‌వీ రమణకుమారి పేర్కొన్నారు . ఆ తర్వాతే ఇంటికిగాని, ప్రభుత్వ క్వారంటైన్‌కు గాని తరలిస్తామని అన్నారు . ఇక నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిపై నిఘా పెట్టనున్నామనిఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచ్‌వో తెలిపారు.

ఇక ఎవరినీ అనుమతించం..

లాక్‌డౌన్‌ మొదలైన దగ్గర నుంచి పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. సుమారు మూడువేల మంది పోలీసులే కాక ఇతర అధికారులు, సిబ్బందిని కూడా విధి నిర్వహణలోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగానే వ్యవహరిస్తున్నామని బి.రాజకుమారి పేర్కొన్నారు.

ఇది చదవండికరోనాపై ఇలా అవగాహన కల్పిస్తున్నారు..!

ABOUT THE AUTHOR

...view details