ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాకపల్లి అత్యాచార కేసు.. దర్యాప్తు సక్రమంగా నిర్వహించలేదన్న ప్రత్యేక న్యాయస్థానం

By

Published : Apr 7, 2023, 7:36 AM IST

Vakapalli Rape Case: ఉమ్మడి విశాఖ జిల్లా వాకపల్లి గిరిజనులపై గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచార ఆరోపణల కేసు దర్యాప్తును సక్రమంగా నిర్వహించలేదని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది. దర్యాప్తు సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన అధికారిపై కన్నెర్ర చేసింది. అదే సమయంలో 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులను నిర్దోషులుగా ప్రకటించింది. గిరిజన బాధిత మహిళలకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Vakapalli Rape Case
వాకపల్లి అత్యాచార కేసులో కీలక తీర్పు

గిరిజనులపై గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచార ఆరోపణల కేసు..కీలక తీర్పు వెల్లడి

Vakapalli Rape Case : విశాఖ ఉమ్మడి జిల్లాలోని జి.మాడుగుల మండలం గిరిజన ప్రాంతంలోని నుర్మతి పంచాయతీ వాకపల్లి గ్రామంలో 2007 ఆగస్టు 21న ఉదయం నక్సలైట్ల ఏరివేతలో భాగంగా గ్రేహౌండ్ పోలీసులు కూంబింగ్​ను నిర్వహించారు. గ్రామంలో ఒంటరిగా ఎదురు పడిన తమపై గ్రేహౌండ్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని 11 మంది ఆదివాసీ మహిళలు ఫిర్యాదు చేసారు.

ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిరసనలు వెల్లువెత్తాయి. గ్రేహౌండ్స్ పోలీసులు ఎ.రవికుమార్, పి.రవికుమార్, డి. రవికుమార్ బి.రవికుమార్, పూర్ణ చంద్రరావు, పి.పవన్ కుమార్, బి.గంగాధర రావు, డి.వి.ఆర్. సురేష్, ఆర్ శ్రీను, కె.దేవుళ్ళు, టి.ప్రసాద్, కె. రాంబాబు, సీహెచ్. సురేశ్‌ బాబు, జి. ముత్యాల రాజు, సిహెచ్. విజయకుమార్, ఎస్. తాతబాబు, డి. సింహాచలం, ఎస్. వెంకటరావు, ఆర్. చంద్రశేఖర్, ఆర్. దేవనాధ్, ఎ.ఎస్. శ్రీనివాసరావులపై 2007లో కేసు నమోదుకు ప్రభుత్వం ఆదేశించింది.

వివిధ కారణాలతో కొంత మంది నిందితులను జాబితా నుంచి తొలగించారు. అంతిమంగా 13 మందిపై న్యాయస్థానం విచారణ జరిపింది. కేసు విచారణలో ఎన్నోమలుపులు తిరిగింది. 2018లో జిల్లా ఎస్సీ, ఎస్టీ అత్యాచార (నిరోధక) ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. సుదీర్ఘంగా జరిగిన విచారణలో 38 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసును అధికారులు ఎమ్. శివానంద రెడ్డి, బి. ఆనంద రావు దర్యాప్తు చేసారు. కేసు విచారణలో ఉండగా దర్యాప్తు అధికారి బి.ఆనంద రావు మరణించారు.

ఈ కేసులో లోతైన విచారణ జరిపిన న్యాయస్థానం దర్యాప్తు సక్రమంగా చేయడంలో అధికారులు విఫలమైన కారణంగా 13 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. సరైన మార్గంలో దర్యాప్తు నిర్వహించి సా క్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని ఆక్షేపించింది. బాధ్యులైన ఎమ్. శివానంద రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు అపెక్స్ కమిటీకి సిఫారసు చేసింది. నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు ఎం. రవి, హరీష్ వర్మ వాదనలు వినిపించారు.

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్ పీపీ)గా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. బాధిత గిరిజన మహిళలు పరిహారం పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది. పరిహార సొమ్మును నిర్ణయించాలని విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. లైంగిక దాడికి బాధితులైన 9 మంది గిరిజన మహిళలకు డ్యామేజ్ కింద ఆ సొమ్ము చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details