ఆంధ్రప్రదేశ్

andhra pradesh

HC On Trees Cutting: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్లు కొట్టివేతపై హైకోర్టు ఆగ్రహం..

By

Published : Jun 15, 2023, 12:33 PM IST

HC On Trees Cutting: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్లు కొట్టివేతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టివేతను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. కొట్టివేత ఆలోచన ఎవరిదని ప్రశ్నించింది. ఎవరు అనుమతిచ్చారని ఆరా తీసింది. అటవీశాఖ అధికారులు నుంచి అనుమతులేమైనా పొందారా? అని ప్రశ్నించింది. ఇంకా ఏమందంటే..?

HC On Trees Cutting
ఏయూలో చెట్లు కొట్టివేతపై హైకోర్టు

HC On Trees Cutting: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్లు నరికివేతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల కొట్టివేత ఆలోచన ఎవరిదని.. అటవీశాఖ అధికారులు నుంచి అనుమతులేమైనా పొందారా అని ప్రశ్నించింది. చెట్లు కొట్టివేయలేదని కేవలం పొదలను మాత్రమే తొలగించామని.. శరీరంపై దురదకు కారణమయ్యే మొక్కలను కొట్టేశామని ఏయూ తరపు న్యాయవాది చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ మొక్కల పేర్లేమిటో చెప్పాలని నిలదీసింది. కోర్టు ముందున్న ఫొటోలను పరిశీలిస్తే అవి మొక్కలుగా లేవని.. వృక్షాలుగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఆర్. రఘునందన్​ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఇదీ జరిగింది.. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్​ కాలేజీలో గతేడాది నవంబరు 12న మోదీ సభ జరిగింది. కాగా అక్కడి గ్రౌండ్​లో జరిగే ప్రధాని సభకు సుమారు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందనే అంచనాలతో అధికారులు.. గ్రౌండ్ లోపల, వెలుపల చదును చేసే కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా సభ జరిగిన మైదానం పరిసరాల్లోని చెట్లను తొలగించారు. సభ ప్రాంగణం చుట్టు పక్కల, అలాగే అక్కడికి చేరుకునే రహదారికి రెండు వైపులా ఉన్న చెట్లను ప్రధాని సెక్యూరిటీ పేరుతో కొట్టేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లను ప్రధాని పర్యటన పేరుతో నరికేయటం దారుణమని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

పైగా ఏయూ పరిధిలోని చెట్లు కొట్టరాదనే హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో.. చెట్లను తొలగించటం సరైన చర్య కాదంటున్నారు. ఇలా ఏయూ పరిధిలోని చెట్లను నరికివేయటం పలు విమర్శలకు దారితీసి.. వివాదాస్పదమైంది. ప్రధాని పర్యటన పేరుతో.. ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న చెట్లను నరికివేయటం సరికాదని, కానీ వైసీపీ ప్రభుత్వం వాల్టా చట్టం(ANDHRA PRADESH WATER, LAND AND TREES ACT–2002) ఉల్లంఘిస్తూ ఏయూ పరిధిలోని చెట్లను తొలగించారని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

చెట్లను తొలగించిన ప్రాంతం ఆయన వార్డు పరిధిలోకే వస్తుంది. కాగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ.. ఏయూలో చెట్లను పరిరక్షించాలని తీర్పు చెప్పింది. దీంతో ఏయూలో చెట్ల నరికివేత చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘినలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీతల మూర్తి యాదవ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details