ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ.. రాజధానిగా అభివృద్ధి వైపు అడుగులు

By

Published : Jun 27, 2021, 8:11 PM IST

రాజధానిని వీలైనంత త్వరగా విశాఖకు తరలించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దానికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖ అభివృద్ధి కోసం కీలకమైన బీచ్ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయించింది. వినోదం, పార్కులు, గోల్ఫ్‌ కోర్సులు, రెస్టారెంట్‌లు వంటి ప్రాజెక్టుల కోసం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు.

Visakha city development
విశాఖ నగర అభివృద్ధి

పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది. నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేలా విశాఖ బీచ్‌ రోడ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయిం తీసుకుంది. పర్యాటక ప్రాంతాల్లో అగ్రస్థానంలో ఉన్న విశాఖను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా మార్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ - భీమిలి - భోగాపురం బీచ్‌ రోడ్డు అభివృద్ధి.. ఈ బీచ్‌ కారిడార్ అభివృద్ధిలో ప్రధాన అంశమని ప్రభుత్వం చెబుతోంది. వెయ్యి 21 కోట్ల రూపాయలతో 570 ఎకరాల్లో బీచ్ కారిడార్‌ ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 6 వరుసల రహదారిగా బీచ్‌ కారిడార్‌ ఏర్పాటుతో పాటు.. దీన్ని గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారిడార్‌లో బౌద్ధ పర్యాటక ప్రాజెక్టులు, బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి, 120 మీటర్ల ఎత్తున స్కై టవర్‌ నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. భోగాపురం, అన్నవరం వద్ద లగ్జరీ రిసార్ట్స్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ బీచ్‌ కారిడార్‌కు సమాంతరంగా రణస్థలం నుంచి ఆనందపురం వరకు మరో రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. భీమిలిలోని పురాతన వారసత్వ భవనాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఎకో వైల్డ్‌ లైఫ్‌ టూరిజం పేరుతో విశాఖలోని జంతు ప్రదర్శనశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గోస్తనీ నది మీద రెండు హ్యాంగింగ్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టే ఆలోచన చేస్తున్నారు.

విశాఖ నగర అభివృద్ధి

వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పనుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను విఎంఆర్​డిఎతో పాటు... పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగానే బీచ్ కారిడార్ అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించడం సహా పనులు పూర్తిచేయాలని భావిస్తోంది. 2 వేల కోట్ల రూపాయల మేర నిధుల సమీకరణకు వెసులుబాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండీ..మెగా రైడ్​: పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details