MLA Balakrishna వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సత్యసాయి జిల్లా లేపాక్షి లో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ మాధవ్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సేవ చేయకుండా నీలి చిత్రాలు చూపించారని విమర్శించారు. ఎంపీ ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్చేశారు.
ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చేతకాని పాలనతో ప్రజలను కష్టాలపాలు చేశారని విమర్శించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వైకాపా ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కనీసం ఎరువులు, విత్తనాలను కూడా రాయితీపై ఇవ్వడంలేదన్నారు. కార్యక్రమానికి తెదేపా నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.