ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతి ఉగాది ఇలాగే కొనసాగాలంటే.. ఏమి చేయాలో మీ అందరికీ బాగా తెలుసు: వసుంధర దేవి

By

Published : Mar 23, 2023, 2:07 PM IST

MLA Balakrishna wife Vasundhara participated in the Ugadi festival celebrations: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏడాది ఉగాది పండగ ఇలాగే కొనసాగాలంటే.. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఏమి చేయాలో ప్రజలందరికీ బాగా తెలుసునని.. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి అన్నారు. నందమూరి పురమైన హిందూపురంలోని గుడ్డం రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆమె.. మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Vasundhara
Vasundhara

ఉగాది వేడుకలో సందడి చేసిమ బాలకృష్ణ సతీమణి

MLA Balakrishna wife Vasundhara participated in the Ugadi festival celebrations: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన ఉగాది పండుగ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ఆమె సోదరి గరికపాటి లోకేశ్వరిలు పాల్గొన్నారు. గుడ్డం రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని.. ఉగాది పచ్చడిని తీసుకున్నారు. నందమూరి పురమైన హిందూపురంలో ఉగాది సంబరాలు జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందని వసుంధర దేవి అన్నారు.

ముందుగా హిందూపురంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, టాలీవుడ్​ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు వసుంధర దేవికి పుష్ప గుచ్చలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వసుంధర దేవి, సోదరి గరికపాటి లోకేశ్వరిలు.. గోమాతకు పూజ చేసి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని.. ఉగాది పచ్చడిని తీసుకున్నారు.

అనంతరం నందమూరి వసుంధర దేవి మీడియాతో మాట్లాడుతూ..''నందమూరి పురమైన హిందూపురంలో ఉగాది సంబరాలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడే ప్రతి ఉగాదిని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. హిందూపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆరోగ్య రథం, అన్నా క్యాంటీన్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఇలాగే కొనసాగాలంటే వచ్చే సంవత్సరం ఏమి చేయాలో అందరికీ బాగా తెలుసు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా హిందూపురం అభివృద్ధి కోసమే కృషి చేస్తుంటారు. ఇక్కడ వారి యోగక్షేమాల గురించి, హిందూపురంలోని సమస్యల గురించి ఆయన.. ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా అడిగి తెలుసుకుంటారు.'' అని ఆమె అన్నారు.

మరోవైపు 'శోభకృత్‌ నామ' ఉగాది వేడుకలు హిందూపురంలో సందడిగా సాగాయి. పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయ ఆవరణలో జరిగిన వేడుకల్లో అర్చకులు.. వసుంధర దేవి చేత గోపూజ, రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలను చేయించారు. అనంతరం ఆలయం ఆవరణలో పాండురంగభజన కళాకారులు నిర్వహించిన డప్పు నృత్యాలను ఆమెను కాసేపు తిలకించి, కళాకారులతో కలిసి కోలాటం వేశారు.

ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఉగాది పంచాంగ శ్రవణంలో వసుంధర దేవి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పండితులు వెంకటాద్రి సురేష్‌ పంచాంగాన్ని చదివి వినిపించారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు రాబోయే రోజుల్లో కూడా రాజ్య పూజ్యం అధికంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ విజయం సాధిస్తారని తెలియజేశారు. దీంతోపాటు వర్షాలు సంమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని పండితులు పేర్కొన్నారు. ఇక, ఉగాది వేడుకలో ప్రియా నృత్యాలయం నృత్యకారుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నందమూరి ఎమ్మెల్యే బాలకృష్ణ సోదరి గరికపాటి లోకేశ్వరితోపాటు మేనల్లుడు శ్రీనివాస్‌, సుమిత్రలు, బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర, హిందూపురం సమన్వయకర్త శ్రీనివాసరావుతోపాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details