ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP Leaders Land Scam: ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణం.. వైసీపీ నాయకుల్లో మొదలైన అలజడి..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 8:01 AM IST

YSRCP Leaders Land Scam: ప్రకాశం జిల్లా వైసీపీ నాయకుల్లో అలజడి మొదలైంది. భూ కుంభకోణంలోని నకిలీ పత్రాల ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ పంచాయితీ అక్కడ ఇక్కడ చేరి చివరకు తాడేపల్లిలోని సీఎంవోకు చేరింది. కుంభకోణంలో కోట్లల్లో చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. పలువురు కీలక నాయకులు ఈ వ్యవహరంలో సహాయం చేసినట్లు సమాచారం.

YSRCP_Leaders_Land_Scam
YSRCP_Leaders_Land_Scam

YSRCP Leaders Land Scam: ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణం.. వైసీపీ నాయకుల్లో మొదలైన అలజడి..

YSRCP Leaders Land Scam:ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో వైసీపీ నాయకులు ఉండడం.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం.. ఆ పార్టీ నేతలను కలవరపరుస్తుంది. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, నిందుతుల పేర్లు బయటపెట్టాలని బాలినేని డిమాండ్‌ చేయగా, సీఎంవో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. మరోవైపు నిందితుల్లో అగ్రనేతలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒంగోలులో ఇటీవల వెలుగుచూసిన నకిలీ పత్రాల కుంభకోణం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పంచాయితీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంవో అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో.. జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌ తాడేపల్లి వెళ్లారు. సీఎంవోలో అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ సీతారామాంజనేయులుతో భేటీ అయ్యారు.

రుషికొండను మించిన విధ్వంసం.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సమక్షంలోనే

రెండు రోజుల పాటు సీఎంవోలో జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. గురువారం మాజీమంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిసి మాట్లాడారు. ఈ కేసును తేల్చాలని ప్రకాశం కలెక్టర్‌, ఎస్పీలకు తాను చెప్పినా సరిగా స్పందించడం లేదని వారికి గట్టిగా చెప్పాలని కోరారు. దీంతో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌లను శుక్రవారం పిలిపించి బాలినేని సమక్షంలోనే ధనుంజయరెడ్డి మాట్లాడారు.

నిందితుల పేర్లను బయటపెట్టి తర్వాత దర్యాప్తును కొనసాగించండని బాలినేని కోరినట్లు తెలిసింది. ‘దర్యాప్తులో లభించే ఆధారాల మేరకే నిందితుల వివరాలను వెల్లడించడం, అరెస్టు చేయడమనేది విధానం’ అని ఎస్పీ తెలిపినట్లు సమాచారం. ‘రాజకీయంగా నన్ను ఇబ్బందిపెట్టేలా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా ఈ కేసు విషయమై లీకులను ఇస్తున్నారంటూ బాలినేని ఆరోపించినట్లు తెలిసింది. కేసులో ఇప్పటివరకూ వివిధ శాఖల సహకారంతో చేసిన దర్యాప్తు వివరాలను ఎస్పీ చూపించినట్లు తెలిసింది.

Temple lands: ఆలయ భూములపై అధికార పార్టీ నేతల కన్ను.. లీజు పేరుతో 9 ఎకరాలకు టోకరా

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో కొందరు భూ కుంభకోణానికి తెర లేపారు. గుంటూరు, చిలకలూరిపేట, ఇతర ప్రాంతాల నుంచి 100, 50 , 20 స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేశారు. అధికారుల పేర్లతో తమకు కావాల్సిన ముద్రలు, రౌండ్‌ సీల్స్‌ తయారు చేసుకున్నారు. పాత బాండ్‌ పత్రాలు, నకిలీ వీలునామాలు, పాత తేదీలతో ఒప్పంద పత్రాలు రూపొందించారు.

శివారు ప్రాంతాల్లోని వివాదాస్పద భూములపై కన్నేశారు. భూ యజమానుల మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి జీపీఏ పొందడం, పాత తేదీలతో ఒప్పందాలు తయారు చేసి ఆ భూములను వివాదాల్లోకి లాగారు. తద్వారా యజమానులను బెదిరించి కోట్లు దండుకున్నారు. నకిలీ దస్తావేజులు, పత్రాలతో జరిగిన భూ కుంభకోణంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుయాయులే సూత్రధారులంటూ ఇటీవల ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్​లో భూవివాదం.. అనంతపురంలో వైసీపీ నేత సెటిల్​మెంట్ దందా

దీనిపై స్పందించిన ఆయన ఈ వ్యవహారంలో ఎంతటి వారున్నా శిక్షించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. కానీ కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అసలైన వారిని పట్టుకోవడం లేదంటూ బాలినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వద్దంటూ డీజీపీకి లేఖ రాయడమే కాకుండా గన్‌మెన్‌లను సరెండర్‌ చేశారు.

బాలినేని డీజీపీ లేఖ ఘటన తర్వాత పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అధికార పార్టీలోని ఇద్దరు ప్రజాప్రతినిధులు, మరో ఇద్దరు సూత్రధారులపై చర్యలకు ఉపక్రమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

YCP Leader land Grab in Nellore District: దారి కబ్జాతో 100 ఎకరాలను ఆక్రమించిన వైసీపీ నేత.. ఆత్మహత్యే శరణ్యం అంటున్న బాధితుడు

వారందరి పేర్లు బయటికి వస్తే ప్రకాశం జిల్లాలో తమకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందని.. వారి సూచనల మేరకే ఉన్నతాధికారులు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పంచాయితీ సీఎంవోకు చేరింది.

ఒంగోలు, ముక్తినూతలపాడు, మంగమూరు రోడ్డు, మామిడిపాలెం, రాజీవ్‌నగర్‌, కర్నూలు రోడ్డు, కొప్పోలు తదితర ప్రాంతాల్లోని పొలాలు, స్థలాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని సాగిన కుంభకోణంలో కోట్లల్లో చేతులు మారినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. అధికార పార్టీలోని పలువురు కీలక నాయకులు ఇందుకు సహాయం చేసినట్లు తేలింది. మొత్తం 19మంది పాత్ర ఉందని గుర్తించినప్పటికీ.. పోలీసులు ఇప్పటి వరకు కొందరినే అరెస్టు చేశారు. ఈ పరిణామాలు బాలినేనికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి.

సీఎంవోలో జరిగిన పంచాయితీపై బాలినేని కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ‘ఒంగోలులో వెలుగుచూసిన కుంభకోణాన్ని సీఐడీ సహకారంతో నిగ్గు తేలుస్తామని అందులో ఉంది. ఈ కుంభకోణంలో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని.. అవసరమైతే సీఐడీ సహకారాన్ని తీసుకుని కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ధనుంజయరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించినట్లు ఆ ప్రకటనలో ఉంది. సీఎం కార్యదర్శి హామీ ఇచ్చినందున.. సరెండర్‌ చేసిన భద్రతా సిబ్బందిని తిరిగి తీసుకుంటున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.

Land Occupation: ఆ మంత్రుల నియోజవర్గాల్లో యథేచ్ఛగా భూ అక్రమాలు..

ABOUT THE AUTHOR

...view details