ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Balineni Emotional In Press Meet: తీవ్ర భావోద్వేగానికి గురైన బాలినేని..సొంత పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు

By

Published : May 5, 2023, 7:46 PM IST

Updated : May 6, 2023, 7:10 AM IST

Etv Bharat
Etv Bharat ()

Balineni Srinivasa Reddy Emotional Words: సొంత పార్టీలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను టికెట్ ఇప్పించిన వాళ్లే ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమని భావోద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గంపై దృష్టి సారించేందుకే ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశానని స్పష్టంచేశారు.

తీవ్ర భావోద్వేగానికి గురైన బాలినేని..సొంత పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు

Balineni Srinivasa Reddy Crying In Press Meet : పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొంతమంది అలుసుగా తీసుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్సీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానన్నారు. ఎవరిపైనా సీఎంకు ఫిర్యాదు చేయలేదన్న బాలినేని... అలాంటి మనస్తత్వం తనది కాదన్నారు. తాను టికెట్‌ ఇప్పించిన వారే అధిష్ఠానానికి తనపై ఫిర్యాదు చేస్తున్నారని... వారి మాదిరిగా పార్టీకి నష్టం చేయలేదని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వివాదాలకు అధిష్ఠానమే ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నానన్న బాలినేని... నియోజకవర్గంపై దృష్టి సారించేందుకే ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశానన్నారు.

వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉండి పార్టీని బలోపేతం చేయడంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకపాత్ర పోషించారు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీపై పూర్తి పట్టు చూపిన బాలినేనికి ఇప్పుడు జిల్లాలో ఎలాంటి గుర్తింపు లేకపోవడం మాజీ మంత్రిని స్థిమితం లేకుండా చేస్తోంది. తొలుత ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న బాలినేనిని ఆ పదవి నుంచి తప్పించి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

"ఎమ్మెల్యేల చేత సీఎంకు ఫిర్యాదు చేయిస్తారు. నేను నియోజకవర్గాల్లో కలుగజేసుకుంటున్నానని ఫిర్యాదు చేయిస్తున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి. పార్టీ కోసం ఎంత శ్రమించానో, ఎంత బాధ పడ్డానో నాకు తెలుసు. నా మీద, నా కొడుకు మీద ఆరోపణలు చేసేవాళ్లు తప్పు చేశామని చూపించండి."- బాలినేని శ్రీనివాస రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే

సీఎం మార్కాపురం పర్యటనలో హెలీప్యాడ్‌ వద్దకు బాలినేని కారును అనుమతించకపోవడం, డీఎస్పీ బదిలీల్లో తన మాట చెల్లకపోవడం వంటి పరిణామాలు.. బాలినేనికి మింగుడుపడకుండా చేశాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుత పరిస్థితి వెనుక ప్రకాశం జిల్లాకే చెందిన కొందరు నేతలు, ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ఆయన అనుకూల వర్గం ఆరోపిస్తోంది.

మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు బాలినేని అనుకూల వర్గం ఒంగోలులో భారీ నిరసన ర్యాలీ చేపట్టి, సజ్జల దిష్టిబొమ్మ తగలబెట్టడం, కొందరు రాజీనామా ప్రకటనలు చేయడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు, అవినీతిపై ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. జిల్లాకే చెందిన కీలక నేత స్వయానా బాలినేనికి బావ అయిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలతో బాలినేనికి పొసగడం లేదు. జిల్లాలో ఆధిపత్యాన్నినిలుపుకునే క్రమంలో సుబ్బారెడ్డికి, బాలినేనికి మధ్య దూరం పెరిగింది.

బాలినేని వియ్యంకుడు కుందా భాస్కర్ రెడ్డి విశాఖ జిల్లా అచ్యుతాపురంలో అటవీభూములు ఆక్రమించి లే ఔట్ వేశారనే ఆరోపణలు రావడం వెనుక వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లు బాలినేని వర్గం అనుమానిస్తోంది. మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం వైవీ సుబ్బారెడ్డితో చేతులు కలపడం బాలినేనికి ఇబ్బందిగా మారిందని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా బాలినేని విషయంలో ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు.

ఇక బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు అటవీశాఖమంత్రిగా ఉన్నప్పటీ నుంచి వినిపిస్తున్నాయి. తాళ్లూరు వద్ద ఓ కొండ ప్రాంతాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. వియ్యంకుడు భాస్కర్‌ రెడ్డి ఒంగోలులో వేస్తున్న వెంచర్‌కు అక్రమంగా నీటి రవాణా ఏర్పాట్లు చేయడం, ఎరజర్ల కొండ ప్రాంతంలో గ్రావెల్‌ తవ్వకం, కె. బిట్రగుంట కుమ్మర్ల స్థలాన్ని ఖాళీ చేయించడం, చెన్నైలో హవాలా డబ్బు రవాణా వంటి ఆరోపణలు బాలినేనికి ప్రతికూలంగా మారాయి. బాలినేని ఈ ఆరోపణల్ని ఎప్పటికప్పుడు ఖండించారు. అయితే సొంత పార్టీ నేతలే పదే పదే అవినీతి ఆరోపణలు చేయడంతో బాలినేని ఇక భరించడం తన వల్ల కాదని భావోద్వేగానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి :

Last Updated :May 6, 2023, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details