కరోనా బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన సూచనలతో ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకుంటున్నాయి. ఉదయగిరి వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు సుమారు 70 మందితో ఒకే గదిలో సమావేశం నిర్వహించారు. ఇరుకుగా కూర్చోబెట్టి రైతు భరోసా కేంద్రాల నిర్వహణపై సమీక్ష జరిపారు. మండలంలో ఒకవైపు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాంటి సమయంలో భౌతికదూరం పాటించకుండా సమావేశం నిర్వహించడం పట్ల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వ్యవసాయ సిబ్బంది సైతం ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు ఒకే గదిలో 70 మందితో ఎలా సమావేశం నిర్వహిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా అంటే లెక్క లేదు... భౌతికదూరం ధ్యాస లేదు..!
ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి మాత్రం ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా, భౌతికదూరం పాటించకుండా సమావేశాన్ని నిర్వహించారు.
సామాజిక దూరం లేకుండానే వ్యవసాయశాఖ సమావేశం