ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కంప్యూటర్ తెచ్చిన తంటా.. విద్యార్దుల ఎదుటే కుమ్ములాట! ముగ్గురు టీచర్ల సస్పెండ్!

By

Published : Mar 12, 2023, 9:13 PM IST

Suspended : అది ఓ గ్రామంలోని ప్రభుత్వ​ ఉన్నత పాఠశాల. భావి పౌరులకు బుద్దులు చెప్పి, జ్ఞానం నేర్పించాల్సిన టీచర్లు.. బుద్దిహీనంగా విద్యార్దుల ఎదుటే కుమ్ములాడుకున్నారు. ఎన్నో రోజులుగా లోలోన రగులుతున్న కోపం ఒక్కసారిగా రచ్చకెక్కడంతో.. వివాదం పోలీస్ స్టేషన్​కు చేరింది. మీరు టీచర్లేనా.. అంటూ పోలీసులు, ఆ ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేశారు. ఇది తెలిసిన ఉన్నతాధికార్లు.. ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారు.

Veerapanenigudem zphs
వీరపనేనిగూడెం జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల

School Head Master and two Teachers Suspended : పాఠశాలలోని కంప్యూటర్​ను వాడే విషయంలో.. వివాదం తెలెత్తి, చినిచినికి గాలివానగా మారింది. ఆ స్కూలులో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ తన బ్యాంకు ఖాతా కోసం ప్రింటర్​ను వాడే క్రమంలో, అలా చేయకూడదని ప్రధానోపాధ్యాయుడు వారించాడు. కంప్యూటర్​ను వ్యక్తిగత పనులకు వాడొద్దనడంతో.. సదరు మహిళా టీచర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదం అనేక మలుపులు తీసుకుని, చివరకు పోలీస్ స్టేషన్​కు చేరడంతో ప్రధానోపాధ్యాయుడితో పాటు సదరు మహిళా టీచర్​పై కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా తనను వేధిస్తున్నారని ప్రధానోపాధ్యాయుడితో పాటు, మరో ఉపాధ్యాయుడిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. ఆ ముగ్గుర్ని సస్పెండే చేస్తూ.. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వివాదం వెనుక కథ..గన్నవరం మండలం వీరపనేనిగూడెం జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో.. కంప్యూటర్ విషయంలో వచ్చిన వివాదం వల్ల మహిళ ఉపాధ్యాయురాలు తనపై చెప్పుతో దాడి చేశారని ప్రధానోపాధ్యాయుడు ఆరోపించారు. పాఠశాలలో ఒకే కంప్యూటర్ ఉండగా.. అది తరచూ రిపేర్​కు వచ్చేదని ఆయన తెలిపారు. అలా ఎందుకు వస్తుందో తెలియక.. దానిని రికార్డిస్ట్​ మాత్రమే వినియోగించేలా పాస్​వర్డ్​ ఏర్పాటు చేయించానని అన్నారు. దీనివల్ల వినియోగం తగ్గి బాధ్యతయుతంగా ఉంటుందని ఇలా చేసినట్లు వివరించారు. అయితే ఇటీవల మహిళ టీచర్​ తన వ్యక్తిగత అవసరం కోసం కంప్యూటర్​ను వినియోగించిందని.. అలా చేయకూడదని ఆమెకు సూచించనని అన్నారు. దీంతో ఆమె ఆగ్రహనికి గురై తనతో వాగ్వాదానికి దిగిందని ఆరోపించారు. ఈ క్రమంలో చెప్పుతో తనపై దాడి చేసిందని అన్నారు. అంతటితో ఆగకుండా పాఠశాలలో గందరగోళ పరిస్థితులు సృష్టించిందని పేర్కోన్నారు. గతంలో ఓ సారి పాఠశాల పనివేళ విషయంలో మహిళా టీచర్​కి తనకు మధ్య వివాదం తలెత్తగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వివరాలు సేకరించారని తెలిపారు.

ఇదే కాకుండా ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయుడు.. ఇద్దరు కలసి తనను వేధిస్తున్నారని మహిళా టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. తనపై దాడి చేసిందని​ ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు మహిళా టీచర్ పై కూడా కేసు నమోదు చేశారు.

వివాదంపై ఉన్నతాధికారుల చర్యలు : పాఠశాలలో వివాదం జరుగుతున్న విషయం తెలుసుకున్న ఉన్నాతాధికారులు చర్యలు చేపట్టారు. వివాదాలకు కారణమైన మహిళ టీచర్​ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థుల ఎదుటే ఉపాధ్యాయులు గొడవలకు దిగుతున్నా పట్టించుకోవడం లేదని.. ప్రధానోపాధ్యాయుడ్ని సైతం సస్పెండ్ చేశారు. తనను వేధింపులకు గురిచేసున్నారని ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయుడిపై.. గతంలో మహిళ టీచర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదాలపై విచారణ పూర్తయ్యే వరకు జిల్లా విద్యాశాఖాధికారి ముగ్గుర్ని సస్పెండ్​ చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details