ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హలో! ఆ రోజు ఓటు వేసి వెళ్తాం - మా ఓటు అాలాగే ఉంచండి! ఓటరు జాబితాలో కావల్సినవారివి, మృతుల పేర్లు మాత్రం కొనసాగుతాయ్!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 7:27 AM IST

Updated : Nov 28, 2023, 8:07 AM IST

YCP Govt Vote Gambling in AP: ఎన్టీఆర్ జిల్లాలో ఓటరు జాబితా చిత్రవిచిత్రాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. వెతికేకొద్ది తప్పులు వెలుగు చూస్తున్నాయి. విజయవాడ మధ్య నియోజకవర్గంలో అయితే వైసీపీ సర్కారుకు కావాల్సినవారైతే ఎక్కడ ఉన్నా ఓటుహక్కు ఉంచుతున్నారు. ఇక్కడకే పరిమితమా అంటే.. మృతులు, డబుల్ ఎంట్రీ ఓట్లనూ మాత్రం అలాగే ఉంచేస్తున్నారు.

YCP_Govt_Vote_Gambling_in_AP
YCP_Govt_Vote_Gambling_in_AP

YCP Govt Vote Gambling in AP: వైసీపీ మద్దతుదారులైతే.. ఎక్కడ ఉన్నా ఓటు హక్కు ఉంచుతాం. గిట్టనివారైతే.. పీకేస్తాం! ఇదీ రాష్ట్రంలో ఓటరు జాబితా దందా తీరు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఓటరు జాబితా సవరణలో తవ్వేకొద్దీ తప్పులు వెలుగుచూస్తూన్నాయి. కొందరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా.. ఓటు హక్కు కల్పించని అధికారులు.. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన ఓట్లనూ మాత్రం తొలగించలేదు.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం 63వ డివిజన్‌లోని ఇంటిలో ఉంటోంది నలుగురు. కానీ ఈ ఇంటి నంబర్‌ పేరుతో.. ఓటరు జాబితాలో ఏకంగా 51 ఓట్లున్నాయి. అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. 30 ఓట్లు తొలగించారు. 21 అలాగే ఉంచారు. జాబితాలో పేరున్న ఓటర్లకు ఫోన్లు చేస్తే.. మేం కడపలో ఉన్నాం.. మా ఓటు ఉంచండి.. వచ్చి వేస్తామంటూ బూత్‌ స్థాయి అధికారులకు సమాధానం చెప్తున్నారట. బీఎల్​ఓలు కూడా.. వాటిని తొలగించకుండా అలానే ఉంచారు.

ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు- తూతూమంత్రంగా బీఎల్వోల పరిశీలన

దీనిపై నున్న పోలీసు స్టేషన్‌లో తెలుగుదేశం నేతలు.. ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు. కనీసం విచారణా చేయలేదు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఇలాంటి చిత్రవిచిత్రాలు.. చాలానే ఉన్నాయి. మొత్తం 257 పోలింగ్‌ బూత్‌లుంటే.. కేవలం 98 బూత్‌ల పరిధిలోనే.. 26వేల 458 అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. డిసెంబరు 3, 4 తేదీల్లో మిగతా బూత్‌లలో.. దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మధురానగర్‌ 162 పోలింగ్‌ బూత్‌ పరిధిలో అసలు ఇంటింటి సర్వే జరగలేదు. ఈ బూత్‌ పరిధిలో మృతుల పేర్లతో దాదాపు 35 ఓట్లు ఉన్నాయి. 29వ డివిజనులోని 10 పోలింగ్‌ బూత్‌ల పరిధిలోనూ 305 మంది మృతుల పేర్లు ఓటరు జాబితాలో.. యథాతథంగా ఉన్నాయి. నియోజకవర్గవ్యాప్తం 15 వేల మంది చనిపోయినవారి పేర్లు ఉన్నట్లు గుర్తించి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. డబుల్‌ ఎంట్రీలనూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇలాగేనా వైనాట్! టీడీపీ కంచుకోటలో ఓట్ల తొలగింపునకు భారీగా ఫారం-7 దరఖాస్తులు - ఎమ్మెల్యే మద్దాళి వాట్సప్‌ చాటింగ్‌ను బయటపెట్టిన టీడీపీ

58వ డివిజనులోని తోటవారి వీధిలో రెండు అపార్టుమెంట్లలో.. 18 ఏళ్లు దాటిన వారు 178 మంది ఓటు హక్కు కోసం రెండుసార్లు దరఖాస్తులు చేసినా వారికి.. అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ తెలుగుదేశం సానుభూతిపరులున్నారనే కారణంతోనే ఓటు హక్కు కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని.. కృష్ణలంక నదిఒడ్డున నివసించే వారిని అక్కడ నుంచి లేపేశారు.

మొత్తం 714 మంది 59వ డివిజన్‌ పరిధిలోని రామానగర్‌లో.. నివాసం ఏర్పరచుకున్నారు. వారు తమ ఓట్లను సెంట్రల్‌ నియోజకవర్గంలోకి మార్చాలని.. కొత్తగా ఓటు హక్కు ఇవ్వాలని దరఖాస్తు చేసినా మోక్షం లభించలేదు. ఎన్నికల జాబితాల్లో.. మార్పులు, చేర్పులు నిరంతరం కొనసాగుతాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ వేగవంతం కావట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓట్ల వేటలో అరాచకీయం! మనకు అనుకూలంగా లేకుంటే లేపేయ్ - ఉన్నతాధికారులకు వైసీపీ నేతల హుకుం?

హలో! ఆ రోజు ఓటు వేసి వెళ్తాం - మా ఓటు అాలాగే ఉంచండి! ఓటరు జాబితాలో కావల్సినవారివి, మృతుల పేర్లు మాత్రం కొనసాగుతాయ్!
Last Updated : Nov 28, 2023, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details