ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి సన్మానాలా.. వామపక్ష పార్టీల ఆగ్రహం

By

Published : Nov 9, 2022, 4:34 PM IST

PM Modi visit AP: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుతామని చెప్పాకే.. ప్రధాని మోదీ ఏపీలో అడుగు పెట్టాలని.. వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈనెల 11, 12 తేదీల్లో మోదీకి నిరసన తెలుపుతామని, ప్రజలూ నల్ల జెండాలు ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. విభజన హామీల కోసం మెడలు వంచుతానన్న జగన్‌.. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని సన్మానాలు చేస్తారని.. ప్రశ్నించారు.

PM Modi visit AP
Left parties meeting

Left parties meeting at Vijayawada: ప్రధాని ఏపీ పర్యటన సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై వామపక్ష పార్టీల నేతలు విజయవాడలో సమావేశం అయ్యారు. మోదీ ఈనెల 11, 12 పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మోదీ ఏపీని అన్ని‌విధాలా మోసం చేసి ఇప్పుడెలా వస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఒక్క అంశంలో అయినా న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. జగన్ అధికార యంత్రాంగాన్ని మెుత్తం మోదీ పర్యటనకు వినియోగిస్తున్నారని మండిపడ్డారు. వేల‌ కోట్లతో ప్లీనరీ సమావేశం తరహాలో ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హోదా లేదు.. పోలవరం పూర్తి కాలేదు, విభజన హామీలు అమలు‌ చేయలేదని ఆరోపించారు. మోదీ మెడలు వంచుతానన్న జగన్.. అతని ముందు ముందు తల‌ వంచుతూనే ఉన్నారని విమర్శించారు. జగన్​కు మోదీ అంటే భయమా, కేసుల నుంచి బయట పడేందుకా అంటూ నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుడదని పోరాటాలు చేస్తున్నామన్నారు. మోదీ స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుతామని చెప్పాకే ఏపీలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రెండు రోజులపాటు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు సైతం నల్ల జెండాలతో నిరసన తెలపాలని కోరారు.

విజయవాడలో సమావేశమైన వామపక్ష పార్టీల నేతలు

ప్రజలకు ద్రోహం చేసిన వారికే.. ప్రజల సొమ్ముతో పెద్దపీట వేస్తున్నారని సీపీఎం నేత శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. రైల్వే జోన్ ఇవ్వరు.. ఏపీకి అన్యాయం చేసిన వారికి సన్మానాలా అంటూ దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్ తీర్మానం చేశారని గుర్తుకు చేశారు. భాజపా తరహాలో వైకాపాకు సైతం ప్రజా వ్యతిరేక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం లో నిరసనకు తెలిపే హక్కు లేకుండా పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని వైకాపా ప్రభుత్వం కూడా మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మేలు‌ చేసేలా హామీల అమలుకు డిమాండ్ చేయాలని కోరారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details